తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ సెంటర్కు వెళ్లేందుకు గూగుల్ మ్యాప్స్ను నమ్ముకున్న ఓ విద్యార్థికి భారీ షాక్ తగిలింది.
తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే పరీక్షలు రాసేందుకు ఎగ్జామ్ సెంటర్కు వెళ్లేందుకు గూగుల్ మ్యాప్స్ను నమ్ముకున్న ఓ విద్యార్థికి భారీ షాక్ తగిలింది. అతడు చేరుకోవాల్సిన ఎగ్జామ్ సెంటర్కు కాకుండా వేరే చోటుకు చేరుకున్నాడు. వివరాలు.. ఖమ్మం జిల్లా కొండాపురం గ్రామానికి చెందిన వినయ్ అనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి గూగుల్ మ్యాప్స్ సహాయంతో ఓ ఎగ్జామ్ సెంటర్కు చేరుకున్నాడు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత అది తాను పరీక్ష రాయాల్సిన సెంటర్ కాదని తెలిసింది.
దీంతో వెంటనే తాను పరీక్ష రాయాల్సిన సెంటర్ వివరాలు తెలుసుకుని అక్కడకు బయలుదేరాడు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో అతడిని సిబ్బంది పరీక్షా హాలులోకి అనుమతించలేదు. దీంతో వినయ్ కన్నీళ్లతో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే నిమిషం నిబంధన అమల్లో ఉండటంతో.. రాష్ట్రంలో పలుచోట్ల పరీక్ష రాసేందుకు నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా విద్యార్థులు పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు.
తెలంగాణలో 4,82,677 మంది ఇంటర్ ఫస్టియర్, 4,65,022 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల కోసం దరఖాస్తుచేసుకున్నారు. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు 26,333 ఇన్విజిలేటర్లు, 75 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 200 సిట్టింగ్ స్క్వాడ్లను కూడా బోర్డు ఏర్పాటు చేసింది.
