హైదరాబాద్ నుంచి చెన్నైకి మారిన ఇండియన్ రేసింగ్ లీగ్.. కారణం ఇదే..
ఎఫ్4 ఇండియన్ ఛాంపియన్షిప్ తొలి రేస్కు వేదిక హైదరాబాద్ నుంచి చెన్నైకి మారింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడమే దీనికి కారణం అని తెలుస్తోంది.

హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలు వాయిదా పడడమో, వేరే రాష్ట్రాలకు తరలిపోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో జరగాల్సిన రెండు రేసింగ్ పోటీలు రద్దయ్యాయి. హుస్సేన్ సాగర్ తీరాన, నెక్లెస్ రోడ్ వేదికగా జరగాల్సిన ఎఫ్ ఫోర్ ఇండియన్ ఛాంపియన్ షిప్, ఇండియన్ రేసింగ్ లీగ్ ల నిర్వహణకు బ్రేక్ పడింది. ఇండియన్ రేసింగ్ లీగ్ చెన్నైలో జరపడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈనెల 4, 5 తేదీల్లో హుస్సేన్ సాగర్ తీరాన ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహించాల్సి ఉండగా… దీనికి సంబంధించి ఇప్పటికే సగం ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ, ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిర్వహించడం కుదరకపోవడంతో చెన్నైకి తరలించారు. హైదరాబాదులో ఐఆర్ఎల్ కు సంబంధించి టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.
వేదిక మారినప్పటికీ, రేసు తేదీలు మారకుండా ఉండటం గమనించాల్సిన విషయం. టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి రీఫండ్ లభిస్తుంది. ఈ మేరకు బుకింగ్ పార్టనర్ పేటీఎం ఇన్సైడర్ టిక్కెట్ హోల్డర్లకు దానికి సంబంధించిన ఇమెయిల్లను పంపుతుంది.