Asianet News TeluguAsianet News Telugu

మోదీ, కేసిఆర్ ను ఓడించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

స్వాతంంత్య్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ రేవంత్ ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. 

Independence Day Celebrations at Gandhi Bhavan... TPCC Chief Revanth Reddy fires modi kcr
Author
Hyderabad, First Published Aug 15, 2021, 11:51 AM IST

హైదరాబాద్: కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసిఆర్ ను ఓడించినప్పుడే రైతులకు, యువతకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఇద్దరినీ గద్దె దించేందుకు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ స్ఫూర్తితో ఏడాది పొడుగునా పోరాటం చేయాలన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలతో ప్రపంచ దేశాల ముందు భారత్ ని ఒక శక్తిగా నిలుపుతాం అన్నారు రేవంత్.  

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తిరంగ జెండాను ఆవిష్కరించిన రేవంత్ తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్య  దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం 75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్నామంటే అందుకు కాంగ్రెస్ నేతల త్యాగాలే కారణమన్నారు. 

''ఎంతో మంది అమరులు తమ ప్రాణాలను బలిచ్చి దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చారు. ప్రజాస్వామ్య స్పూర్తితో, శాంతియుత వాతావరణంలో స్వాతంత్ర్య ఉద్యమం జరిగింది. హింసకు తావులేకుండా ఉద్యమం చేయడంతోనే దేశానికి స్వాతంత్ర్యం సిద్దించింది. శాంతియుత ఉద్యమాలు నిర్వహించడంలో ప్రపంచ దేశాలకు భారత్ మార్గదర్శి'' అన్నారు. 

''కొన్ని రాజకీయపార్టీలు మతాల మధ్య చిచ్చుపెడుతూ స్వార్ధ రాజకీయలకు దేశాన్ని ప్రయోగశాలగా మార్చారు. మోదీ పాసిస్టు ప్రభుత్వం వచ్చాక రైతుల జీవితాలను కట్టుబానిసలుగా మార్చి అంబానీ, ఆదానీలకు తాకట్టుపెట్టేలా నల్ల చట్టాలు తెచ్చారు. ఇలాంటి నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు మొక్కవోని దీక్షతో 9నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్నారు'' అని రేవంత్ గుర్తుచేశారు. 

read more  స్వాతంత్య్ర వేడుకల సాక్షిగా... బిజెపి కార్పోరేటర్ పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి (వీడియో)

''అంతటా ఉత్పత్తి చేసినవాడే ధర నిర్ణయిస్తే... రైతు మాత్రమే దళారీ వ్యవస్థ నిర్ణయించిన ధరకే అమ్ముకునే దౌర్భాగ్యస్థితిలో ఉన్నారు. రైతులకు ఉచిత కరెంట్, ఇన్పుట్ సబ్సిడీ, మద్దతు ధర, భూములపై సీలింగ్ యాక్ట్ తెచ్చి దళితులకు గిరిజనులకు, వెనుకబడిన వర్గాలకు  హక్కులు కల్పించింది కాంగ్రెసే''  అని పేర్కొన్నారు. 

 ''తెలంగాణ సీఎం కేసిఆర్ కొరివి దైయ్యంలా ప్రాజెక్టుల పేరుతో, అభివృద్ధి కార్యక్రమాలు పేరుతో దళిత గిరిజన భూములను లాక్కొని బజార్ లో నిలబెట్టాడు. పోడు భూములకు కాంగ్రెస్ పట్టాలిస్తే హరితహారం పేరుతో అటవీశాఖ అధికారులతో ఆడబిడలను చెట్లకు కట్టేసి హింసించి గుంజుకుంటున్నారు. ఖమ్మంలో చంటిపిల్లలున్న ఆడబిడ్డలను సైతం జైలుకు పంపి పాశవికంగా పాలిస్తున్నారు'' అని మండిపడ్డారు.

''ఇంటికో ఉద్యోగం అని కేసిఆర్, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని మోదీ నిరుద్యోగులను మోసం చేసారు. చివరకు నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. పెత్తందారీ పోకడలతో పాఠశాలను బంధు చేసిర్రు. ఏడేళ్లలో కెసిఆర్ ఇచ్చిన ఉద్యోగాల కంటే రిటైర్ అయినా ఉద్యోగులే ఎక్కువ'' అన్నారు. 

''ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. దేశాన్ని అఖండ భారత్ గా నిలబెట్టే శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకే వుంది'' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios