తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన: జులై 21 వరకూ కుండపోత వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన చేసింది వాతావరణ శాఖ. రాగల మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా కుండపోత వానలు కురుస్తున్నాయి. అయితే మరో 5 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో జోరుగా వానలు పడుతున్నాయి. దీనికి తోడు ఈనెల 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈనెల 21న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఇవాళ, ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. అటు ఉత్తరాంధ్ర తీరప్రాంతం, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఈనెల 21న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
అటు చాలా రాష్ట్రాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ హెచ్చరించింది. బెంగాల్, సిక్కింగ్ రాష్ట్రాల్లో జులై 19వరకూ భారీగా కురిసి క్రమంగా తగ్గు ముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మధ్య మహారాష్ట్రలోని ప్రాంతాలైన కొంకణ్, గోవా, ఘాట్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది.