ఎల్బీనగర్ ఫ్లై ఓవర్ పై నుండి దూకి నరేందర్ ఆత్మహత్య: భార్యనే కారణమా?
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఫ్లై ఓవర్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నరేందర్ గౌడ్ మృతి చెందాడు.
హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఫ్లై ఓవర్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లికి చెందిన పొలగోని నరేందర్గౌడ్ వనస్థలిపురం సాగర్ కాంప్లెక్స్లో భార్య పార్వతమ్మ, కుమారుడు శ్రీకర్తో కలసి ఉంటున్నాడు. నరేందర్ గౌడ్ కారు డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంత కాలంగా నరేందర్ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. దీనికి తోడు కుటుంబ కలహలు కూడ దీనికి తోడయ్యాయి. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఎల్బీనగర్ ఫ్లైఓవర్ పైకి తన బైక్ పై చేరుకున్నాడు నరేందర్. బైక్ను అక్కడే వదిలి ఫ్లైఓవర్ పైనుంచి దూకాడు. ఈ సంఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డటంతో స్థానికులు 108 అంబులెన్స్లో ఓ ప్రయివేట్ హాస్పిటల్కు తరలించారు.
చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. తన కుమారుడి చావుకు కారణం తన కోడలు పార్వతమ్మతో పాటు తన బంధువైన రమేష్ కారణమని నరేందర్ తండ్రి ఆరోపించారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుడి జేబు నుండి సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.