పాతబస్తీలో మెట్రో రైలు పనులపై మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో కీలక ప్రకటన చేశారు. పాతబస్తీ మెట్రో పనులను త్వరగా చేపట్టాలని సీఎం కేసీఆర్ మున్సిపల్ శాఖకు సూచించారని ట్వీట్‌లో తెలిపారు.  

ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల వారి అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పెండింగ్ లో పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశిస్తుంది. ఇందులో భాగంగానే పెండింగ్ లో ఉన్న పాతబస్తీ మెట్రో పనులను ప్రారంభించింది. పాతబస్తీలో మెట్రో రైలు పనులు మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపారు. పాతబస్తీ మెట్రో పనులను త్వరగా చేపట్టాలని సీఎం కేసీఆర్ మున్సిపల్ శాఖకు సూచించారని మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్‌లో తెలిపారు. పాతబస్తీ మెట్రో రైలు పనులను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందనీ, మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మిస్తున్న లార్సెన్ అండ్ టూబ్రో ఛైర్మన్‌తో సీఎం కేసీఆర్ మాట్లాడారని కేటీఆర్ తెలిపారు.

ఇప్పటికే కారిడార్‌-2లో భాగంగా ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు నాలుగు మెట్రోస్టేషన్ల (సాలార్జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, శాలిబండ, శంషీర్‌గంజ్‌)తో అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. సుమారు రూ.2వేల కోట్ల అంచనాతో 5.5 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం నిర్మాణానికి హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్ట్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌), ఎల్‌ అండ్‌ టీ సంస్థ తదుపరి చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు నివేదిక రూపొందించింది.

గతంలో పాతబస్తీలో మెట్రో వద్దని అనేకమంది తమ వాదన వినిపించారు. మెట్రో నిర్మాణం వల్ల దాదాపు 1000 మతపరమైన సంస్థలు, చరిత్రాత్మక సంస్థలు దెబ్బతినే అవకాశం ఉందని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో నిర్మాణ సంస్థలు ఎల్‌ అండ్‌ టీ , హెచ్‌ఎంఆర్‌ఎల్‌ చేతులెత్తేశాయి. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందనీ, తమ ప్రాంతానికి కూడా మెట్రో కావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారని డిమాండ్లు వచ్చాయి. 

ఈ నేపథ్యంలో అక్కడ మెట్రో నిర్మాణానికి గల అడ్డంకుల విషయమై ప్రభుత్వం సర్వే చేయించింది. ఆ సర్వేలో సానుకూలం ఫలితాలు రావడంతో నిర్మాణ పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మున్సిపల్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో మూడు మార్గాల్లో తన సేవలను అందిస్తోంది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు (రెడ్‌లైన్ సర్వీస్), రాయ్‌దుర్గ్ నుంచి నాగోల్ వరకు (బ్లూ లైన్ సర్వీస్), ఎంజిబిఎస్ నుంచి జూబ్లీబస్ స్టేషన్ వరకు (గ్రీన్ లైన్) సేవలను అందిస్తోంది.