వివాదంలో చిక్కుకున్న మేయర్ విజయలక్ష్మి
కొందరు ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడంతో తమ ఇంట్లో పనిచేసే వారి కుటుంబీలకు ఆ ఉద్యోగం ఇచ్చారు. దీంతో.. ఈ విషయంలో వివాదం నెలకొంది.
హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వివాదంలో ఇరుక్కున్నారు. ఇటీవల ఆమె పారిశుద్ధ్య కార్మికుల పనితీరు పరిశీలించారు. ఈ క్రమంలో... కొందరు ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడంతో తమ ఇంట్లో పనిచేసే వారి కుటుంబీలకు ఆ ఉద్యోగం ఇచ్చారు. దీంతో.. ఈ విషయంలో వివాదం నెలకొంది. తాము కరోనా రావడంతో విధులకు రాలేకపోయామని.. ఆ లోపు.. తమ ఉద్యోగాలు మేయర్ వేరే వారికి ఇచ్చేశారంటూ బాధితులు వాపోయారు.
తమ ఇంటిలో పని చేసే వారి కుటుంబీకులను నియమించేందుకు ఔట్ సోర్సింగ్పై పని చేస్తున్న ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులను తొలగించారంటూ సీపీఎం నగర శాఖ జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పార్టీ నగరశాఖ కార్యదర్శి ఎం. శ్రీనివాస్ బాధితులతో కలిసి సోమవారం కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పంజగుట్ట ప్రాంతంలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు వి.భారతి, ఎల్.రమాదేవి, ఎస్ఎఫ్ఏ (శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్) సాయిబాబాలను తొలగించి మేయర్ ఇంట్లో పని చేసే వారి కుటుంబ సభ్యులను నియమిస్తూ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ జూన్ 22న ఉత్తర్వులు జారీ చేసినట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.
తొలగించిన కార్మికులను యథావిధిగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 15 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్న భారతి గత ఏప్రిల్ 20న కరోనా బారిన పడి ఖమ్మం ఆస్పత్రిలో చేరిందని, తోడుగా పారిశుద్ధ్య కార్మికురాలిగానే పని చేస్తున్న తన కుమార్తె రమాదేవిని తీసుకు వెళ్లిందని, ఈ మేరకు అధికారులకు సమాచారం ఇచ్చారని వినతిపత్రంలో పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్నాక మే 11న డ్యూటికీ రాగా, వారిద్దరినీ తొలగించామని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు.
అప్పటి నుంచీ జీతం ఇవ్వకపోయినా పనిచేస్తున్నారని, వారిని యథావిధిగా కొనసాగించడంతో పాటు విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంలో మేయర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. మేయర్ దగ్గర పని చేసేవారు కార్మికులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు