ఆడపిల్లలు పుట్టారని... భార్యను హింసిస్తున్న పోలీసు అధికారి
ఇద్దరు ఆడపిల్లలే పుట్టారనే కారణంతో నా భర్త నన్ను రోజు శారీరకంగానూ, మానసికంగానూ హింసించేవాడు. ఆడపిల్లలను కన్నావు అంటూ నన్ను రోజు కొట్టేవాడు
ప్రభుత్వ ఉన్నతాధికారి హోదాలో ఉండి.. బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తే.. చాలా దారుణంగా ప్రవర్తించాడు. ఇద్దరు ఆడపిల్లలే పుట్టారనే కారణంతో భార్యను రోజూ హింసించాడు ఓ పోలీసు అధికారి. అతను పెట్టే బాధలతో విసిగెత్తిపోయిన బాధితురాలు న్యాయం కోసం పోరాటానికి దిగింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. అంబర్ పేటకు చెందిన ప్రియాంక(22)కు సిద్ధిపేట పోలీసు కమిషనరేట్ లో పనిచేస్తున్న ఉన్నతాధికారి సాయి కుమారితో 2015లో వివాహమైంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు సంతానం. ఆ పిల్లల వయసు ఒకరికి మూడు సంవత్సరాలు. మరొకరికి 2 సంవత్సరాలు. ఇద్దరు ఆడపిల్లలే పుట్టారనే కారణంతో భార్య, పిల్లలను అంబర్ పేటలో వదిలేసి అతను సిద్ధిపేటలో ఉంటున్నాడు.
ఈ విషయమై బాధితురాలు మాట్లాడుతూ..‘ ఇద్దరు ఆడపిల్లలే పుట్టారనే కారణంతో నా భర్త నన్ను రోజు శారీరకంగానూ, మానసికంగానూ హింసించేవాడు. ఆడపిల్లలను కన్నావు అంటూ నన్ను రోజు కొట్టేవాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.’’ అని ఆమె వాపోయింది.
తన కూతురికి న్యాయం చేయాలంటూ ప్రియాంక తల్లి ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు.