కేసీఆర్ కు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి "షాక్"
బంజారాహిల్స్ లోని తన క్యాంప్ కార్యాలయం వద్ద తరుచుగా కరెంట్ కట్ అవుతోందని, అందువల్ల తన రోజువారీ పనులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు 24 గంటలు కరెంట్ ఉంటుందని హామీ ఇస్తున్నారు. హైదరాబాదులో గతంలో మాదిరిగా విద్యుత్తు కోతలు లేవు. కానీ తన క్యాంప్ కార్యాలయం వద్ద 25 కెవిఏ జెనరేటర్ నెలకొల్పాలని హైదరాబాదు మేయర్ గద్వాల విజయలక్ష్మి కోరుతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న క్యాంప్ కార్యాలయం విద్యుత్తు సమస్యతో తల్లడిల్లుతోందన, తరుచుగా లోడ్ షెడ్డింగ్ జరుగుతోందని ఆమె చెప్పారు.
తన క్యాంప్ కార్యాలయం వద్ద జనరేటర్ ను నెలకొల్పాలని కోరుతూ గద్వాల విజయలక్ష్మి జిహెచ్ఎంసీ కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ కు ఓ నోట్ పెట్టారు. దానికి రూ.5 లక్షలు ఖర్చవుతుంది. తరుచుగా విద్యుత్తు కట్ అవుతోందని, దాంతో తన రోజువారీ పనులకు అసౌకర్యం ఏర్పడుతోందని అంటూ అందువల్ల వెంటనే 25కేవీఎ జనరేటర్ ను తన క్యాంప్ కార్యాలయం వద్ద నెలకొల్పాలని ఆమె కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ గద్వాల విజయలక్ష్మి హైదరాబాదులో పవర్ కట్ అవుతోందని అనడం టీఆర్ఎస్ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. ఇది ఒక రకంగా కేసీఆర్ కు షాక్ ఇవ్వడమేనని అంటున్నారు. ప్రతిపక్షాలు గద్వాల విజయలక్ష్మి మాటలను తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలున్నాయి.
కొన్ని సందర్భాల్లో గంటల తరబడి కరెంట్ సరఫరా ఉండడం లేదని విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఎలక్ట్రిక్ లైన్స్ కు సంబంధించి ఏ విధమైన సమస్య లేదని విద్యుత్తు శాఖ అధికారులు ఆమెకు చెప్పారు. బంజారాహిల్స్ సబ్ స్టేషన్ ఏ విధమైన విద్యుత్తు అంతరాయాలు లేవని తాము తేల్చుకున్నట్లు దక్కన్ క్రానికల్ రాసింది. మార్చి 1వ తేదీన మెయింటెనెన్స్ పనులు చేసినట్లు, చెట్ట అడ్డంకులను తొలగించడానికి 3 గంటల పాటు పనిచేసినట్లు, ఆ సమయంలో కరెంట్ తీసేసినట్లు సూపరింటిండెంట్ ఇంజనీర్ ఆనంద్ చెప్పినట్లు కూడా రాసింది.