హుజూరాబాద్  అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం నాడు  సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్ధి ఎంపిక, రాహుల్ గాంధీ టూర్ తదితర అంశాలపై చర్చించారు.

హైదరాబాద్: ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటిస్తారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం నాడు గాంధీభవన్ లో భేటీ అయ్యారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రతి మండలంలోని ఓటర్లలో 10 శాతం మంది రాహుల్ సభకు వచ్చేలా ప్లాన్ చేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీ ఎంపిక చేయనుందన్నారు. ఈ విఁషయమై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కమిటీకి సూచించారు.

పార్టీ కోసం పనిచేయడంతో పాటు సామాజికవర్గం ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్ధి ఎంపిక చేయనున్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు.పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ పనిచేసినా వారిపై చర్యలు తీసుకొంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇందులో తనకు కూడా ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు. ఈ నెల 9వ తేదీన ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన దండోరా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన చెప్పారు.