బీఆర్ఎస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీకి కోకాపేటలో 11 ఎకరాల భూ కేటాయింపుపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిల్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రూ. 50 కోట్ల విలువైన భూమిని రూ. 3.41 కోట్లకే కేటాయించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. భూ కేటాయింపు డాక్యూమెంట్లను రహస్యం చేశారని అన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఆగస్టు 16కి వాయిదా వేసింది.
ఇక, ఈ పిల్ను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభ రెడ్డి దాఖలు చేశారు. కోకాపేటలో ఎకరం భూమి మార్కెట్ ధర సుమారు రూ. 50 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 3.41 కోట్లకు భూమిని కేటాయించింని పిల్లో పేర్కొన్నారు. ఇక, మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పేందుకు ఈ కేటాయింపులు జరిగాయని ప్రభుత్వం పేర్కొంటుండగా.. హైదరాబాద్లో మర్రి చెన్నా రెడ్డి హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ లాంటి సంస్థలు కూడా అదే ఉద్దేశ్యంతో ఉండగా కొత్త కేంద్రం అవసరమేంటని ప్రశ్నించారు.
ప్రభుత్వం చెబుతుంది కేవలం కవర్ స్టోరీ అని.. బీఆర్ఎస్కు పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడమే ఈ కేటాయింపు వెనుక అసలు ఉద్దేశమని పద్మనాభ రెడ్డి ఆరోపించారు. బంజారాహిల్లో ఇప్పటికే బీఆర్ఎస్ కార్యాలయం ఉందని.. ప్రజల సొమ్ముతో హైదరాబాద్లో మరో కార్యాలయం అవసరం లేదని పిల్లో పేర్కొన్నారు.
