హీరా గోల్డ్ ఛైర్మెన్ నౌరాహ్ షేక్‌ను  అరెస్ట్ చేసినట్టు  హైద్రాబాద్ నగర పోలీస్ కమిషనర్  అంజనీ కుమార్ ప్రకటించారు


హైదరాబాద్: హీరా గోల్డ్ ఛైర్మెన్ నౌరాహ్ షేక్‌ను అరెస్ట్ చేసినట్టు హైద్రాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రకటించారు. మంగళవారం నాడు హైద్రాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

దేశంలోని పలు రాష్ట్రాల్లో డిపాజిట్లు సేకరించారని నౌరాహ్ షేక్‌పై ఫిర్యాదులు చేశారు. ఎంఈపీ నుండి కర్ణాటక ఎన్నికల్లో నౌరాహ్ షేక్ టిక్కెట్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు రావడంతో ఆమె ఇంట్లో అప్పట్లో సోదాలు కూడ నిర్వహించిన విషయం తెలిసిందే.

ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ పలు రాష్ట్రాల నుండి వందల కోట్లను డిపాజిట్లు వసూలు చేసినట్టు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. దీంతో హైద్రాబాద్, ముంబై, తిరుపతి, బెంగుళూరులలో ఆమెపై కేసులు నమోదైనట్టుగా అంజనీకుమార్ ప్రకటించారు. అయితే నౌరాహ్ షేక్‌పై ఏపీ రాష్ట్రంలో కూడ రెండు కేసులు నమోదైనట్టు ఆయన చెప్పారు.

15 రకాల కంపెనీల పేర్లతో డిపాజిట్లు వసూలు చేశారని ఆయన తెలిపారు. గోల్డ్ స్కీమ్ పేరుతో డిపాజిట్లను సేకరించారని... అన్ని రాష్ట్రాల్లో కలిపి వేల సంఖ్యలో డిపాజిట్లు సేకరించారని తెలిపారు. 

దేశ వ్యాప్తంగా హీరా గ్రూప్‌కు 160కి పైగా బ్యాంకు ఖాతాలు ఉన్నట్టు గుర్తించినట్టు సీపీ చెప్పారు. ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేసి విచారిస్తున్నట్టు చెప్పారు. డిపాజిట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని సీపీ తెలిపారు