Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణను ముంచెత్తిన భారీ వర్షాలు: 9 జిల్లాల్లో రెడ్ అలెర్ట్, నిలిచిన రాకపోకలు

తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ ;ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. వర్షాల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీశారు. 

Heavy rains reported in Telangana lns
Author
Hyderabad, First Published Jul 23, 2021, 10:48 AM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో   మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు హెచ్చరించారు.ఇప్పటికే రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గురువారం నాడు కురిసిన వర్షాలతో  వరద పోటెత్తింది. అంతేకాదు ప్రాజెక్టులు, చెరువులు నిండిపోయాయి. దీంతో  గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి.రాష్ట్రంోని 9 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్‌, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో రెడ్ అలర్ట్ పక్రటించింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. నిర్మల్ , కొమరంభీమ్ జిల్లాలోని పలు మండలాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి.దీంతో 35 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.స్వర్ణ, గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. దీంతో నిర్మల్, భైంసా పట్టణాలు నీట మునిగాయి. కొమరంభీమ్ జిల్లా తిర్యాణి మండలం చింతలమాదర జలపాతంలో బుధవారం నాడు గల్లంతైన రాంవిజయ్‌లోబడే మరణించాడు. ఆయన మహారాష్ట్రలోని రాజుర తాలుకాలోని దేవడ గ్రామానికి చెందినవాడు.  కుంటాల మండలం వెంకటాపూర్ చెరువుకట్ట తెగిన ఘటనలో పొలం పనులకు వెళ్లిన దంపతులను అధికారులు రక్షించారు. నిర్మల్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

కామారెడ్డి జిల్లాలో వర్షానికి 22 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 17,198 ఎకరాల్లో పంట నష్టమైంది.  నిజామాబాద్ జిల్లాలో 7 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఖానాపూర్ మండలంలోని పాకాల సరస్సు 19 అడుగులకు చేరింది. ఖమ్మం జిల్లా భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద సీతవాగు ప్రాంతం సీతమ్మనారచీరల ప్రాంతం నీట మునిగింది.కిన్నెరసాని పరవళ్లు తొక్కింది. మున్నేరు నది 14 అడుగులకు చేరింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దుందుబి , ఊకచెట్టు, మన్నె వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సంగారెడ్డిలో నల్లవాగు అలుగు పోస్తోంది.ధర్మపురి నేరేళ్లగుట్ట వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వేములవాడలోని మూలవాగులో చిక్కుకొన్న ఆరుగురు జాలర్లను పోలీసులు రక్షించారు. కోరుట్ల మండలంలోని జోగన్‌పల్లి పెద్ద చెరువు సమీపంలో వరినాట్లు వేసేందుకు వెళ్లిన 21 కూలీలను ఎస్ఐ గ్రామస్తుల సహాయంతో రక్షించారు. జగిత్యాల జిల్లా అనంతారం వాగులో గురువారం నాడు  నీటి ప్రవాహనికి కారులో ఇద్దరు గల్లంతయ్యారు. నిజామాబాద్ జిల్లాలోని మెండోరాలో భారీ వర్షాలకు ఓ ఆశ్రమంలో వరద నీరు చేరింది. ఈ ఆశ్రమంలో ఉన్న ఏడుగురిని పోలీసులు రక్షించారు.

వరంగల్ జిల్లా లోగత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వల్ల  జిల్లా లో జలమయమైన ప్రాంతాల్లోని ప్రజలకు సత్వర సహాయంఅందించడానికి 1800- 425 -1115 అనే  ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు వరంగల్ అర్బన్  జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం సాయంత్రం  లోయర్ మానేరు డ్యామ్ గేట్లను ఎత్తారు. ఎల్ ఎం డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగడంతో గేట్లను ఎత్తడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios