నిమ్స్ హాస్పిటల్లో చిన్నారులకు అరుదైన గుండె సర్జరీలు జరుగుతున్నాయి. మంత్రి హరీశ్ రావు పిలుపుతో బ్రిటన్ నుంచి ప్రత్యేక వైద్య బృందం నిమ్స్ చేరుకుంది. నిమ్స్, నీలోఫర్ వైద్యుల పరస్పర సహకారంతో ఒక టీమ్గా ఏర్పడి అరుదైన ఆపరేషన్లు చేస్తున్నారు.
హైదరాబాద్: రాజధాని నగరంలో హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో అరుదైన గుండె ఆపరేషన్లు చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా బ్రిటన్ నుంచి వచ్చిన వైద్యుల బృందం, నిమ్స్, నీలోఫర్ వైద్యుల పరస్పర సహకారంలో ఈ గుండె సర్జరీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 8 సర్జరీలు విజయవంతంగా పూర్తయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక ఆహ్వానంతో బ్రిటన్ నుంచి డాక్టర్ వెంకట రమణ దన్నపునేని సారథ్యంలో ఆరుగురు వైద్యుల బృందం నిమ్స్కు వచ్చింది.
చిన్న పిల్లలకు గుండె సర్జరీలు చేయడం సంక్లిష్టమైనదే కాదు.. ఎంతో ఖరీదైన వ్యవహారం కూడా. ప్రభుత్వ హాస్పిటళ్లలో ఇలాంటి సర్జరీలు దాదాపుగా జరగనే జరగవు. కాగా, మంత్రి హరీశ్ రావు నిర్ణయంతో రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ దవాఖానాలో ఈ సర్జరీలు జరుగుతున్నాయి. ప్రైవేటు హాస్పిటల్లలో ఈ సర్జరీలు చేస్తే దాదాపు రూ. 5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అలాంటి ఈ సేవలను ఆ పేద చిన్నారులకు ఉచితంగా అందించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది.
Also Read: వైద్యురాలిని రేప్ చేసిన నర్స్.. ఆన్లైన్లోకి న్యూడ్ ఫొటోలు
తాజాగా నెల రోజుల శిశువుకు సర్జరీని విజయవంతంగా ఈ టీమ్ చేసింది. మహబూబ్నగర్ మిడ్జిల్కు చెందిన ఫాతిమ హృద్రోగ సమస్యతో బాధపడుతున్న తన బిడ్డను తీసుకుని నిమ్స్ హాస్పిటల్కు వచ్చింది. అప్పుడు శిశువు బరువు కేవలం 2.5 కిలోలు మాత్రమే. ఆ బేబీ అర్టీరియల్ అనాటమీ, మల్టిపుల్ వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్స్తో బాధపడింది. గత నెల 28వ తేదీన ఈ శిశువుకు అర్టీరియల్ స్విచ్ రిపేర్, మల్టిపుల్ వీఎస్డీ క్లోజర్ సర్జరీలు సక్సెస్ఫుల్గా నిర్వహించారు. ప్రస్తుతం ఈ చిన్నారి ఐసీయూలో క్రమంగా కోలుకుంటున్నది.
వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అభినందనలు
అరుదైన సర్జరీ చేసి శిశువు ప్రాణం కాపాడినందుకు నిమ్స్ వైద్యులను మంత్రి హరీశ్ రావు అభినందించారు. బ్రిటన్ నుంచి ప్రత్యేక వైద్యుల బృందం వచ్చి సర్జరీల్లో పాల్గొనడం, సహకరించడం గొప్ప విషయమని తెలిపారు. ఆ శిశువు త్వరలోనే పూర్తిగా కోలుకుని తల్లి ఒడికి చేరాలని ఆశించారు.
