రేవంత్ రెడ్డికి హరీష్ షాక్: కొడంగల్ ఆపరేషన్
కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడించేందుకు హరీష్ రావు వ్యూహరచన చేసి, అమలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.ఇటీవల కొడంగల్ కు హరీష్ రావు వరాల వర్షం కురిపించారు.
మహబూబ్ నగర్: కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లో ఆపద్ధర్మ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత హరీష్ రావు చక్రం తిప్పుతున్నారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడించేందుకు హరీష్ రావు వ్యూహరచన చేసి, అమలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.
ఇటీవల కొడంగల్ కు హరీష్ రావు వరాల వర్షం కురిపించారు. తాజాగా కొడంగల్ కు చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులను, కార్యకర్తలను హరీష్ రావు టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. తద్వారా రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చారు. బుధవారం కొడంగల్లో హరీష్రావు పర్యటించారు. ఈ సందర్భంగా కొడంగల్ టీడీపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరారు.
రాష్ట్రంలో పార్టీలన్నీ అవకాశవాదంతో ఏకమవుతున్నాయని, ఒక్క దెబ్బతో నాలుగు పార్టీలకు బుద్ధి చెప్పాలని హరీష్ రావు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ చెబుతున్నారని, పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి తెలంగాణకు అన్యాయం చేశారని ఆయన అన్నారు.
తెలంగాణ వివక్షకు కారణం కాంగ్రెస్ పార్టీనని, తెలంగాణకు అడ్డంపడ్డ పార్టీ టీడీపీ అని ఆయన అన్నారు. ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డు పడుతున్నారని, రేవంత్రెడ్డికి మాటలు ఎక్కువ..చేతలు తక్కువ అని ఆయన అన్నారు.