Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యే రాజాసింగ్ గన్ మ్యాన్ కి కరోనా: క్వారంటైన్ లో కుటుంబం

తెలంగాణాలో ఉన్న ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ గన్ మ్యాన్ కి కూడా కరోనా సోకింది. శుక్రవారం వచ్చిన కరోనా ఫలితాల్లో ఈ గోషామహల్ ఎమ్మెల్యే గన్ మ్యాన్ కి కరోనా పాజిటివ్ గా తేలింది. గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో టెస్ట్ చేపించుకున్నాడు. ఆ టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. 

Goshamaham BJP MLA Raja Singh's Gun Man Tests Positive For Coronavirus
Author
Hyderabad, First Published Jun 20, 2020, 2:32 PM IST

దేశంపై కరోనా వైరస్ మహమ్మారి తన పంజా విసురుతోంది. తన ముందు అందరూ ఒక్కటే అన్నట్టుగా విజృంభిస్తుంది ఈ వైరస్. తెలుగు రాష్ట్రాలపై కూడా ఈ వైరస్ విరుచుకుపడుతుంది. ఇప్పటికే తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలలు కరోనా వైరస్ బారినపడ్డ విషయం తెలిసిందే. 

తాజాగా తెలంగాణాలో ఉన్న ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ గన్ మ్యాన్ కి కూడా కరోనా సోకింది. శుక్రవారం వచ్చిన కరోనా ఫలితాల్లో ఈ గోషామహల్ ఎమ్మెల్యే గన్ మ్యాన్ కి కరోనా పాజిటివ్ గా తేలింది. గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో టెస్ట్ చేపించుకున్నాడు. ఆ టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. 

రాజా సింగ్, అతని కుటుంబ సభ్యులందరినీ హోమ్ క్వారంటైన్ లో ఉంచారు. వారందరి సాంపిల్స్ ను కూడా వైద్యులు సేకరించారు. రెండు రోజుల్లో రిపోర్టు వచ్చే ఆస్కారం ఉంది. వీరితోపాటుగా సదరు గన్ మ్యాన్ ప్రైమరీ కాంటాక్ట్స్ అందరి వివరాలను సేకరిస్తున్నారు. 

ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్నీ ప్రజలతో పంచుకున్నాడు రాజా సింగ్. తన కుటుంబంతోపాటుగా పార్టీకార్యకర్తలందరి సాంపిల్స్ కూడా వైద్యులు సేకరించారని, రెండు రోజుల్లో రిపోర్టులు వస్తాయని ఆయన అన్నారు. 

ఇదిలా ఉండగా... తెలంగాణలో కరోనా కేసుల ఉద్దృతి కొనసాగుతోంది. గడిచిన మూడు నెలల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో 499 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,525కి చేరింది. ఇవాళ ముగ్గురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 198కి చేరుకుంది.

రాష్ట్రంలో 2,976 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 3,352 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా నమోదవుతున్నట్లుగానే హైదరాబాద్‌లో 329 కేసులు నమోదవ్వగా, రంగారెడ్డిలో 129, మేడ్చల్, మంచిర్యాల, నల్గొండలో నాలుగేసి చొప్పున, మహబూబ్‌నగర్ 6, జనగామ 7 కేసులు నమోదయ్యాయి. 

హైదరాబాద్‌లో తాత్కాలిక సచివాలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్‌లో మరోసారి కరోనా కలకలం రేపింది. ఇప్పటికే కొందరు ఉద్యోగులు వైరస్ బారినపడటంతో సంబంధిత శాఖల కార్యాలయాలు మూతపడ్డాయి.

కరోనా భయంతో మిగిలిన శాఖల్లోనూ పరిమిత సంఖ్యలోనే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఇటీవలే ఆర్ధిక శాఖలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ శాఖలోని ఉద్యోగులెవరూ ఆఫీసుకు రావడం లేదు.

అత్యవసరమైతే తప్పించి మిగిలిన ఉద్యోగులు కూడా సచివాలయం వైపు తొంగిచూడటం లేదు. తాజాగా మైనార్టీ సంక్షేమ శాఖకు చెందిన ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది.

దీంతో అప్రమత్తమైన అధికారులు బీఆర్కే భవన్‌ ఎంట్రన్స్ వద్ద  థర్మల్ స్కానర్ కెమెరాలతో పరీక్షించాకే సిబ్బందిని లోపలికి అనుమతిస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది తరచుగా కార్యాలయ ప్రాంగణాన్ని శానిటైజ్ చేస్తున్నారు

Follow Us:
Download App:
  • android
  • ios