డ్యాన్స్ చేస్తూ.. కుప్పకూలిన విద్యార్థిని
పాఠశాలలో ప్రోగ్రాం కోసం డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తూ.. ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని శామీర్ పేటలో చోటుచేసుకుంది.
పాఠశాలలో ప్రోగ్రాం కోసం డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తూ.. ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని శామీర్ పేటలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. శామీర్ పేటలోని జగ్గన్ గూడకు చెందిన అనిల్, జ్యోతి దంపతుల కుమార్తె అనూన్య(14) మజీద్ పూర్ లోని జైన్ హేరిటేజ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రోజులాగానే బుధవారం పాఠశాలకు వెళ్లిన అనూన్య మృత్యు ఒడికి చేరింది.
స్కూల్ లో త్వరలో జరగనున్న ఓ కార్యక్రమానికి సంబంధించి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే బాలికను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు ప్రకటించారు. అనంతరం బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
కాగా.. బాలిక అకస్మిక మరణం.. ఆమె తల్లిదండ్రులను కలచివేసింది. తమ బాలిక చావు పాఠశాల యాజమాన్యమే కారణం అంటూ.. వారు ఆరోపిస్తున్నారు. బాలిక శవంతో పాఠశాల ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.