బీజేపీకి రూ. 20 లక్షలు, టీఆర్ఎస్ రూ. 3 లక్షల జరిమానా.. ఇరు పార్టీలకు జీహెచ్ఎంసీ షాక్..
హైదరాబాద్ శనివారం రోజున రెండు భారీ రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మారిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కాగా, మరోకటి రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ర్యాలీ, సభ ఉన్నాయి. దీంతో హైదరాబాద్లోని బస్టాప్లు, మెట్రో పిల్లర్లు, భారీ హోర్డింగులు.. రెండు పార్టీల ఫ్లెక్సీలతో నిండిపోయాయి.
హైదరాబాద్ శనివారం రోజున రెండు భారీ రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మారిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కాగా, మరోకటి రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ర్యాలీ, సభ ఉన్నాయి. ఈ క్రమంలోనే నగరంలో ఎటుచూసిన బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, కటౌట్స్, వాల్ పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఇక, గత కొద్దిరోజులుగా హైదరాబాద్ నగరంలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్లోని బస్టాప్లు, మెట్రో పిల్లర్లు, భారీ హోర్డింగులు.. రెండు పార్టీల ఫ్లెక్సీలతో నిండిపోయాయి. అయితే ఇలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు, బ్యానర్లు, కటౌట్లు, వాల్ పోస్టర్లు.. చాలా వరకు అనధికారికమైనవే. హైదరాబాద్ వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను గమనించిన జీహెచ్ఎంసీకి చెందిన ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్(ఈవీడీఎం) డైరెక్టరేట్ అధికారులు రెండు పార్టీల నేతలకు జరిమానా విధించారు. శనివారం సాయంత్రం వరకూ బీజేపీ నేతలకు రూ.20 లక్షలు, టీఆర్ఎస్ నాయకులకు రూ.3 లక్షల మేర జరిమానాలు విధించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఈనాడు దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఇక, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ హైదరాబాద్లో ఫ్లెక్సీ వివాదం ముదిరింది. కేసీఆర్కు వ్యతిరేకంగా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టిన బీజేపీ .. ‘‘సాలు దొర.. సెలవు దొర’’ అంటూ ప్రచారం మొదలుపెట్టింది. దీనికి కౌంటర్ గా ‘‘ సాలు మోడీ .. సంపకు మోడీ’’, ‘‘బై బై మోడీ’’ పేరుతో టీఆర్ఎస్ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టింది. పోటాపోటా ఫ్లెక్సీలపై నేతల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. అయితే కంటోన్మెంట్ లో మోడీకి వ్యతిరేకంగా పెట్టిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. మరోవైపు కేసీఆర్ కు వ్యతిరేకంగా పెట్టిన ఎల్ ఈడీ స్క్రీన్లకు జీహెచ్ఎంసీ ఫైన్ విధించింది.