సెప్టెంబర్ 10 నుంచి హైదరాబాద్లో గణేశ్ ఉత్సవాలు... నిమజ్జనం ఎప్పుడంటే..?
కరోనా కారణంగా గతేడాది వాయిదా పడిన గణేశ్ ఉత్సవాలు ఈసారి హైదరాబాద్లో ఘనంగా జరిపేందుకు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ సిద్ధమైంది. దీనిలో భాగంగా ఉత్సవాల ఏర్పాట్లు, ఇతర వివరాలను కమిటీ సభ్యులు మీడియాకు తెలిపారు.
సెప్టెంబర్ 10 నుంచి హైదరాబాద్లో గణేశ్ ఉత్సవాలు జరుగుతాయని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ శనివారం ప్రకటించింది. సెప్టెంబర్ 19న గణేశ్ నిమజ్జనం చేస్తామని కమిటీ వెల్లడించింది. గణేశ్ విగ్రహాల తయారికీ కావాల్సిన ముడిపదార్థాలను ప్రభుత్వం అందించాలని కమిటీ సభ్యులు కోరారు. అలాగే గణేశ్ నిమజ్జనానికి వెళ్లే మార్గాలను బల్దియా అధికారులు బాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిమజ్జనానికి ముందే అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. థర్డ్ వేవ్ ముప్పు కారణంగా ప్రజలు ఉత్సవాల సందర్భంగా కరోనా నిబంధనలను పాటించాలని వారు విజ్ఞప్తి చేశారు. విగ్రహాల ఎత్తుపై పోటీపడకుండా నిమజ్జనం సులువుగా వుండేలా చూడాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.