తెలంగాణ-ఏపీ సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందగా ఎనిమిది మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు.
ఖమ్మం : దైవదర్శనానికి వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయి నలుగురు మృతిచెందగా ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘోర ప్రమాదం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తెలంగాణ-ఏపీ సరిహద్దులో చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 12 మంది ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బ్రిడ్జి పైనుండి కిందపడిపోయింది. దీంతో అప్పటివరకు ఆనందోత్సాహాలతో సాగిన ప్రయాణం ఒక్కసారిగా ఆహాకారాలతో నిండిపోయింది.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు జిల్లా తిరుమలదేవిపేట గ్రామానికి చెందిన ఓ కుటుంబం సీతారామచంద్రుల దర్శనానికి తెలంగాణలోని భద్రాచలం వెళ్లారు. గత మంగళవారం ఉదయమే భద్రాచలం చేరుకున్న కుటుంబం సీతారాముల దర్శనం అనంతరం మధ్యాహ్నం తిరుగుపయనం అయ్యారు. ఇలా 12మందితో కూడిన కుటుంబం ట్రాలీ ఆటోలో వెళుతుండగా తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రమాదం చోటుచేసుకుంది.
బూర్గంపహాడ్ శివారులోని కిన్నెరసాని బ్రిడ్జిపై అదుపుతప్పిన ఆటో వాగులో పడిపోయింది. దీంతో వాహనంలోని నలుగురు మృతిచెందగా మిగతా కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా గాయపడిన వారిని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Read More ఈ లేడీ మహా కిలాడీ... ఏకంగా హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంగానే ఘరానా మోసాలు
అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. మూలమలుపు వద్ద వేగంగా వెళుతున్న వాహనం అదుపుతప్పి బ్రిడ్జిపైనుండి కిందపడివుంటుందని భావిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతుల్లో తండ్రి దుర్గారావుతో పాటు ఇద్దరు కొడుకులు సందీప్, ప్రదీప్ ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి చెందిన నలుగురు ఒకేసారి మృతిచెందడంతో తిరుమలదేవిపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గాయపడిన వారిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం.
