చేనేత వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత: ఎల్. రమణను టీఆర్ఎస్లోకి ఆహ్వానించిన కేసీఆర్
మాజీ టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఇవాళ కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. చేనేత సామాజికవర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. చేనేత కార్మికులకు భీమా సౌకర్యం కల్పిస్తామన్నారు.
హైదరాబాద్:రాజకీయంగా ఎల్. రమణకు మంచి భవిష్యత్తు ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. చేనేత వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించే శుభవార్తను త్వరలోనే వింటారని సీఎం తెలిపారు.టీడీపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు ఎల్. రమణ తన అనుచరులతో కలిసి తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. గులాబీ కండువా కప్పి రమణను కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. గత వారంలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి , టీడీపీకి ఎల్. రమణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఎల్. రమణ ఏ పార్టీలో ఉన్నా కూడ సిన్సియర్ పనిచేసేవాడని ఆయన గుర్తు చేశారు.నమ్మిన సిద్దాంతం కోసం నిరంతరం కష్టపడుతాడని ఆయన చెప్పారు. ఆయన టీఆర్ఎస్ లో చేరడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. చేనేత వర్గంలో ప్రాతినిథ్యం పెరగాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
చేనేత సామాజికవర్గం అనుభవించే బాధల్ని కొన్ని తీర్చామన్నారు. తెలంగాణ ప్రజలకు సేవ చేసే మంచి నేతను రమణ రూపంలో చూస్తారని కేసీఆర్ చెప్పారు. వ్యక్తిగతంగా రమణ తనకు మంచి స్నేహితుడన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ ప్రజల కళ్ల ముందే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
చేనేత కార్మికులకు కూడ భీమా సౌకర్యం వర్తింపజేస్తామన్నారు కేసీఆర్. ఒకటి రెండు నెలల్లో చేనేతలకు కూడ ఈ పథకం వర్తింపజేయాలని యోచిస్తున్నామని ఆయన తెలిపారు. చేనేత కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా ప్రయత్నిస్తున్నామన్నారు సీఎం.వరంగల్ లో మెగా టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు. ఈ పార్క్ లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని సీఎం గుర్తు చేశారు. నిన్న 40 ఎకరాల భూమి విక్రయిస్తే రూ. 2 వేల కోట్లు వచ్చాయన్నారు. ఈ డబ్బులను ప్రజల కోసం ఖర్చు చేస్తామన్నారు. వరి ధాన్యం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రూ. 51 వేల కోట్లు ఆదాయం వస్తోందన్నారు.