జనగామలో నడిరోడ్డుపై మాజీ కౌన్సిలర్ ను నరికి చంపిన దుండగులు
తెలంగాణలోని జనగామలో ఈ తెల్లవారు జామున దారుణ హత్య జరిగింది. మాజీ కౌన్సిలర్ పులిస్వామిని బైక్ మీద వచ్చిన దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ సంఘటన తీవ్ర సంచలన కలిగిస్తోంది.
జనగామ: తెలంగాణలోని జనగామలో గురువారం తెల్లవారు జామున దారుణ హత్య జరిగింది. మాజీ కౌన్సిలర్ పులిస్వామిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి నరికారు. పులిస్వామి వాకింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి కత్తులతో దాడి చేశారు.
దాడిలో నడిరోడ్డుపై కుప్పకూలిన పులిస్వామి అక్కడికక్కడే మరణించాడు. బైక్ దిగి పులిస్వామిపై దాడి చేసిన దుండగులు తిరిగి బైక్ మీద పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే, బైక్ స్టార్ట్ కాకపోవడంతో ఇద్దరు కూడా పరుగు తీశారు. భూవివాదం గానీ పాతక్షకలు గానీ హత్యకు కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నడిరోడ్డుపై జరిగిన ఈ హత్య జనగామలో తీవ్ర సంచలనం సృష్టించింది.