బయోడైవర్శిటీ ఫస్ట్ లెవల్ ఫ్లైఓవర్ ప్రారంభం: తొలగనున్న ట్రాఫిక్ కష్టాలు
బయోడైవర్శిటీ జంక్షన్ లో నిర్మిస్తున్న ఫస్ట్ లెవల్ ఫ్లైఓవర్ ను గురువారం నాడు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
హైదరాబాద్: బయోడైవర్శిటీ జంక్షన్ లో నిర్మిస్తున్న ఫస్ట్ లెవల్ ఫ్లైఓవర్ ను గురువారం నాడు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
గచ్చిబౌలి నుండి మెహిదీపట్నం వైపు రాయదుర్గం వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తొలగిపోనున్నాయి.బయోడైవర్సిటీ లెవల్-1 ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.30.26కోట్లు ఖర్చు చేశారు. దీని పొడవు 690 మీటర్లు, వెడల్పు 11.50 మీటర్లు. ఇది మూడు లేన్లుగా నిర్మించారు.
ఈ ఫ్లై ఓవర్ పై 40 కి.మీ వేగంతోనే వాహనాలు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ వాహనాలు మరింత వేగంగా ప్రయాణం చేయకూడదని ఆంక్షలను విధించారు.
సిగ్నల్ ఫ్రీ గా గచ్చిభౌలి- టోలిచౌకి ఫ్లైఓవర్ ఉండనుంది. దీంతో వాహనదారుల కష్టాలు తీరనున్నాయని అధికారులు చెప్పారు.
ఈ ఫ్లైఓవర్ పూర్తికావడంతో ఎస్ఆర్డీపీ ప్యాకేజీ-4 కింద రూ.379కోట్ల అంచనా వ్యయంతో జేఎన్టీయూ నుంచి బయోడైవర్సిటీ వరకు 12కిలోమీటర్ల కారిడార్లో చేపట్టిన అన్ని ఫ్లైఓవర్లు పూర్తయ్యాయి.
ఈ ప్యాకేజీలో భాగంగా మైండ్స్పేస్ అండర్పాస్, మైండ్స్పేస్ ఫ్లైఓవర్, అయ్యప్ప సొసైటీ జంక్షన్ అండర్పాస్, రాజీవ్గాంధీ జంక్షన్ ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ జంక్షన్ లెవెల్-2 ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ లెవల్-1 ఫ్లైఓవర్ తదితర ఆరు ప్రాజెక్టులు చేపట్టారు.ఇందులో ఐదు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.