తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్ రెడ్డి కన్నుమూత.. సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం
తొలిదశ ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్శిటీ నాటి విద్యార్థి సంఘం నేత డాక్టర్ ఎం.శ్రీధర్ రెడ్డి కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో సోమవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్శిటీ నాటి విద్యార్థి సంఘం నేత డాక్టర్ శ్రీధర్ రెడ్డి నేడు (సోమవారం) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఇవాళ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని తట్టి లేపిన వారిలో డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఒకరు.
మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకి జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. పిసిసి ఉపాధ్యక్షులు కుమార్ రావు, మలిదశ తెలంగాణ ఉద్యమనేత తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ పిసిసి రాష్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ఆయన సమకాలికులు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శ్రీధర్ రెడ్డి ఉన్నత చదువులు చదువుతూ.. తెలంగాణ ఉద్యమ జ్వాలలు దేశవ్యాప్తంగా ఎగజిమ్మిన ఉద్యమనేతగా ఆయన.
శ్రీధర్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
శ్రీధర్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. నాటి 1969 ఉద్యమంలో శ్రీధర్ రెడ్డి కీలక పాత్రను పోశించారన్నారనీ, తొలి, మలి దశల్లో తెలంగాణ ఉద్యమానికి శ్రీధర్ రెడ్డి చేసిన కృషిని సిఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తాను నమ్మిన ఉద్యమ విలువల కోసం శ్రీధర్ రెడ్డి చివరి వరకూ కట్టుబడి, రాజీపడకుండా పనిచేశారని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇదే సమయంలో మానవతారాయ్ మాట్లాడుతూ.. శ్రీధర్ రెడ్డి మృతి తెలంగాణ రాష్ట్రానికి తీరనిలోటని అన్నారు. ఆయన నిఖార్సైన తెలంగాణ పోరాట యోధుడని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి కూడా శ్రీధర్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడని, ఆయన మరణం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శ్రీధర్ రెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే.. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, సిపిఐ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి తదితరులు శ్రీధర్రెడ్డి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు.