కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సంబంధించి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఆట మొదలైందని ఆయన పేర్కొన్నారు.
ఖమ్మంలో మా జాయినింగ్ వుంటుందన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆదివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలబోతున్నామని తెలిపారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు చెప్పేదాన్ని బట్టి తమ నిర్ణయం వుంటుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
కాగా.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కాంగ్రెస్ గూటికి చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఢిల్లీకి షిఫ్ట్ అయింది. కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అయ్యేందుకు జూపల్లి కృష్ణారావు, పొంగులేటిలు ఈరోజు ఢిల్లీ చేరుకున్నారు. వీరిద్దరు ఈ నెల 26న ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఈ భేటిలో జూపల్లి, పొంగులేటిల వర్గాలకు చెందిన కొందరు ముఖ్య అనుచరులు కూడా పాల్గొనున్నారు. రాహుల్తో భేటీ అనంతరం జూపల్లి, పొంగులేటిలు.. ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలతోపాటు మరికొందరు ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
ALso Read: రాహుల్తో జూపల్లి, పొంగులేటి భేటీకి టైమ్ ఫిక్స్.. టీ కాంగ్రెస్ రాజకీయం ఢిల్లీకి షిఫ్ట్..
ఇక, కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అనంతరం జూపల్లి, పొంగులేటిలు.. కాంగ్రెస్లో చేరికకు సంబంధించి ప్రకటన చేయనున్నట్టుగా తెలుస్తోంది. రాహుల్తో భేటీ తర్వాత.. ఖమ్మం, మహబూబ్ నగర్లో సభలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపైనా స్పష్టత వస్తుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే జులై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పొంగులేటి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా సమాచారం. ఈ సభలకు రాహుల్ గాంధీ హాజరవుతారా? లేదా టీ కాంగ్రెస్పై ప్రత్యేక దృష్టి సారించిన ప్రియాంక గాంధీ హాజరవుతారా? అనేది కూడా.. జూపల్లి, పొంగులేటి ఢిల్లీ పర్యటన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
