మేం ఎవ్వరికీ గులాం కాదు.. నా కొడుక్కి పదవి రానివ్వలేదు, పనిచేయకుండానే అడిగామా : అంజన్ కుమార్ యాదవ్
కాంగ్రెస్లో ఇటీవల నెలకొన్న సంక్షోభం సమసిపోయిందని అనుకుంటున్న సమయంలో నేతలు మీడియా ముందుకు వస్తూనే వున్నారు. తాజాగా అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడికి పదవి దక్కనీయకుండా కొందరు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరికీ గులామ్ కాదని.. పార్టీ ఎవరికి పదవి ఇస్తే వారితో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. తన కొడుకు అనిల్కు సికింద్రాబాద్ డీసీసీ ఇస్తామంటే కొందరు అడ్డుపడుతున్నారన అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేయకుండా అనిల్ పదవులు అడిగాడా అని ఆయన ప్రశ్నించారు. పనిచేసే వాళ్లకు పదవులు ఇవ్వకపోతే ఎలా అని అంజన్ కుమార్ యాదవ్ నిలదీశారు.
ఇకపోతే.. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పార్టీకి విరుద్దంగా పనిచేస్తే మధుయాష్కి గౌడ్పై చర్యలు తప్పవని అన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించే వారికిపై తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పారు. పార్టీ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాల్సిందేనని.. గ్రూపులు సమసిపోయాయని, అందరం కలిసే పనిచేస్తామని సుదర్శన్ రెడ్డి చెప్పారు.
ALso REad: పార్టీకి విరుద్దంగా పనిచేస్తే మధుయాష్కిపై చర్యలు తప్పవు.. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి
ఇక, ఇటీవల టీ కాంగ్రెస్లో పీసీసీ కమిటీల ప్రకటన పెనుదుమారమే రేపిన సంగతి తెలిసిందే. అసలైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరుగుతుందని సీనియర్ నేతలు గళం వినిపించారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తున్నారని, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే పదవులు దక్కుతున్నాయని ఆరోపించారు. దీంతో వలస నేతలు వర్సెస్ ఒర్జినల్ కాంగ్రెస్ నేతలుగా సీన్ మారిపోయింది. ఈ క్రమంలోనే టీడీపీ బ్యాగ్రౌండ్ ఉన్న 10 మందికిపైగా నేతలు పీసీసీ పదవులకు రాజీనామా చేయడంతో పార్టీలో సంక్షోభం మరింతగా ముదిరింది.
ఈ క్రమంలోనే అధిష్టానం దూతగా దిగ్విజయ్ సింగ్.. నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగారు. హైదరాబాద్కు వచ్చిన దిగ్విజయ్ సింగ్ పార్టీలో పలువురు నేతలతో భేటీ అయ్యారు. వారి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు.. వారికి కొన్ని సూచనలు కూడా చేశారు. పార్టీ నేతలతో సంప్రదింపుల అనంతరం గురువారం మీడియాతో మాట్లాడిన దిగ్విజయ్ సింగ్.. నాయకులందరితో మాట్లాడనని చెప్పారు. పార్టీలో సమస్యలు అన్నీ సర్దుకున్నాయని .. విభేదాలపై నాయకులు బయట మాట్లాడొద్దని కోరారు.