ఈటల రాజేందర్ రెండు చోట్ల ఓటమి బాధ నుంచి తేరుకున్నట్టు తెలుస్తున్నది. అంతేకాదు, నెక్స్ట్ టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఆదేశిస్తే పోటీ చేస్తానని అన్నారు. దీంతో బండి సంజయ్ తో ఆధిపత్య పోరుకు ఇంకా బ్రేక్ పడలేదా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Etela Rajender: హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఓటమి భారం నుంచి తేరుకున్నట్టు తెలుస్తున్నది. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? అంటే ఔననే సంకేతాలను ఆయన తాజాగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇచ్చారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే.. పార్లమెంటు బరిలో నిలబడతానని వెల్లడించారు. హుజురాబాద్ శాసన సభ సెగ్మెంట్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వస్తుండటం గమనార్హం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈటల రాజేందర్ కేసీఆర్‌తో వైరం తర్వాత పార్టీ నుంచి బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఉద్యమ ప్రస్థానం, వామపక్ష భావాలున్న ఈటల రాజేందర్ అనూహ్యంగా బీజేపీలోకి వెళ్లారు. అందులో ఆయన నిలదొక్కుకుంటారా? లేదా? అనే అనుమానాలు ఒక వైపు ఉండగా.. ఆయనే రాష్ట్ర పార్టీని దాదాపు నియంత్రించే స్థాయికి వెళ్లారు. తెలంగాణ బీజేపీ నేతల్లో కీలకమైన నాయకుడిగా మారిపోయారు. బండి సంజయ్ కుమార్‌తోని ఆయనకు పొసగలేదనే విమర్శలు వచ్చాయి. ఈ సందర్భంలోనే బండ సంజయ్ కుమార్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు విడిచిపెట్టారు. దీంతో పార్టీలో ఆధిపత్య పోరు నడిచింది. అది కూడా బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్టుగానే నడిచినట్టు భోగట్టా.

Also Read: KA Paul: జేడీ లక్ష్మీనారాయణకు ఆర్ఎస్ఎస్ రూ. 1000 కోట్లు ఇచ్చింది: కేఏ పాల్ సంచలన ఆరోపణలు

ఈ తరుణంలో మరోసారి వీరిమధ్య పోరు లోక్ సభ ఎన్నికల కేంద్రంగా జరిగే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎంపీ బండి సంజయ్ మరోసారి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి తన యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నారు. తన ఎంపీ టికెట్ పై పోటీ ఉంటుందని కూడా బహుశా ఆయన ఆలోచించి ఉండడు. అలాంటిది ఇప్పుడు ఈటల రాజేందర్ నుంచి ఎంపీ సీటు కోసం పోటీ వస్తుందనే చర్చ జరుగుతున్నది.

తాజాగా, ఈటల రాజేందర్ ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ పార్టీపై బలమైన విమర్శలు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ గురించి ప్రశ్నించగా.. ఇంకా వాటికి మూడు నెలల సమయం ఉన్నదని, తాను పోటీ చేయడాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందని వివరించారు. పార్టీ హైకమాండ్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆదేశిస్తే తప్పక బరిలో నిలబడుతానని, ఎక్కడి నుంచి పోటీ చేయాలో కూడా బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందని, తమ పార్టీ వద్ద అపార సమాచారం ఉంటుందని వివరించారు.