నేను ఏ పార్టీలో ఉన్నానో తెలియదు, కేసీఆర్ ను అడగండి: డీఎస్
తాను ఏ పార్టీలో ఉన్నాననే విషయంపై రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నానో తనకే తెలియదని, ఆ విషయం గురించి కేసీఆర్ ను అడగాలని ఆయన అన్నారు.
నిజామాబాద్: తన రాజకీయ జీవితం గురించి రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నానో తనకే తెలియదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడగాలని ఆయన అన్నారు. తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన శుక్రవారంనాడు మాట్లాడారు.
తన కుమారుడు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలవడంపై ఆయన స్పందించారు. అది సంజయ్ ఇష్టమని ఆయన అన్నారు. మరో కుమారుడు బిజెపిలో చేరి ఎంపీగా గెలిచారని ఆయన గుర్తు చేశారు.
టీఆర్ఎస్ నుంచి తనకు ఆహ్వానాలు రావడం లేదని, తాను టీఆర్ఎస్ ఎంపీనేనా అనే విషయం కేసీఆర్ ను అడగాలని ఆయన అన్నారు. ఒకే ఇంట్లో మూడు పార్టీలు అనే విషయంపై ప్రశ్నిస్తే ఒకే ఇంట్లో మూడు మూడు పార్టీలని తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్ారని ఆయన అన్నారు. చాలా మంది ఎంపీల ఇళ్లలో భార్యలు ఒక పార్టీలో, భర్తలు మరో పార్టీలో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. పీసీీస అధ్యక్షుడిగా తాను కూర్చునే చక్రం తిప్పానని అన్నారు.
చిన్న కుమారుడు అరవింద్ బిజెపిలోకి వెళ్లనప్పుడు తాను వ్యతిరేకించలేదని, కష్టపడి ఎంపీగా గెలిచాడని ఆయన చెప్పారు. కుమారులిద్దరు తనకు రెండు కళ్లలాంటివారని, భవిష్యత్తును నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికి ఉందని, పెద్ద కుమారుడు సైతం రాజకీయాల్లో ఎదిగి పేరు తెచ్చుకోవాలని ఆయన అన్నారు. తనతో పాటు టీఆర్ఎస్ లోకి వచ్చిన సంజయ్ ఇప్పుడు కాంగ్రెసులో చేరుతానని అంటున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం రాత్రి సంజయ్ తన తండ్రి డీఎస్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ధర్మపురి శ్రీనివాస్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి కాంగ్రెసు అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయరుగా పనిచేశారు. తాజాగా, సంజయ్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు.
డి. శ్రీనివాస్ కాంగ్రెసుకు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. ఆయన టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఆయనకు కేసీఆర్ తో తీవ్రమైన విభేదాలు వచ్చాయి. ఈ క్రమలో ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. డి. శ్రీనివాస్ కు వ్యతిరేకంగా నిజామాబాద్ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ కూడా రాశారు. డీఎస్ మీద చర్యలు తీసుకోవాలని వారు కేసీఆర్ ను కోరారు.