ఉద్యోగం ఇప్పిస్తానని రోగిని అమ్మేసిన డాక్టర్
తన వైద్యానికి.. కూతురు పెళ్లికి డబ్బులు వస్తాయి కదా అని ఆశ పడింది. వెంటనే కువైట్ కి వెళ్లడానికి బయలుదేరింది. కాగా.. అక్కడ ఆమెతో పనిచేయించుకుంటున్నారు కానీ..కనీసం తినడానికి తిండి కూడా పెట్టడం లేదు.
అనారోగ్యంతో బాధపడుతున్న రోగికి చికిత్స అందించి ప్రాణాలు పోయాల్సింది పోయి.. దారుణంగా మోసం చేశాడు. వైద్యానికి కావాల్సిన డబ్బులు వస్తాయని.. మంచి ఉద్యోగం ఇప్పిస్తానని రోగిని నమ్మించి.. ఏకంగా అమ్మేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టోలిచౌకి సమతా కాలనీకి చెందిన తాహేరాబేగం(40) అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స కోసం గోల్కొండ కోటోరా హౌస్ వద్ద ఉన్న షిఫా క్లినిక్ డాక్టర్ షబ్బీర్ హుస్సేన్ వద్దకు వచ్చేది. అయితే.. కువైట్ లో ఓ ఇంట్లో పని మనిషిగా చేరితే రూ.25 వేలు సంపాదించుకోవచ్చని ఆ వైద్యుడు ఆమెను నమ్మించాడు.
అతని మాటలను ఆమె పూర్తిగా నమ్మింది. తన వైద్యానికి.. కూతురు పెళ్లికి డబ్బులు వస్తాయి కదా అని ఆశ పడింది. వెంటనే కువైట్ కి వెళ్లడానికి బయలుదేరింది. కాగా.. అక్కడ ఆమెతో పనిచేయించుకుంటున్నారు కానీ..కనీసం తినడానికి తిండి కూడా పెట్టడం లేదు. దీంతో.. తనను ఇండియాకు పంపించమని మహిళ వేడుకుంది. అయితే.. సదరు వైద్యుడు రూ.2లక్షలకు తనను అమ్మేశాడని అక్కడి యజమానుల ద్వారా మహిళ ఆలస్యంగా తెలుసుకోవడం గమనార్హం. ఇదే విషయం ఆమె స్వదేశంలోని కుటుంబసభ్యులకు చెప్పడం అసలు విషయం బయటపడింది.