కొడుకుతో తన కూతురికి విడాకులు ఇప్పించాడని.. వియ్యంకుడి దారుణహత్య
కొడుకు చేత తన కూతురికి విడాకులు ఇప్పించి.. ఆమె జీవితాన్ని నాశనం చేశాడని వియ్యంకుడిని దారుణంగా హత్య చేయించాడు.
కొడుకు చేత తన కూతురికి విడాకులు ఇప్పించి.. ఆమె జీవితాన్ని నాశనం చేశాడని వియ్యంకుడిని దారుణంగా హత్య చేయించాడు. మైలార్దేవ్ పల్లి, సైఫ్ కాలనీకి చెందిన మహమ్మద్ అమ్జద్ అలీఖాన్ ఫ్లైవుడ్ వ్యాపారం చేస్తుంటాడు..
ఇతని కుమారుడు మహ్మద్ అలీఖాన్కు అసద్ఖాన్ కుమార్తెతో 2015లో వివాహమైంది. పెళ్లై ఏడాది దాటినా సంతానం లేకపోవడంతో కోడలికి 2016లో విడాకులు ఇప్పించి.. కొడుకుకి మరో పెళ్లి చేశాడు అమ్జద్.. దీంతో తన కుమార్తె జీవితాన్ని నాశనం చేశాడని అమ్జద్పై అసద్ కక్ష పెంచుకుని.. ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో ఫలక్నూమాకు చెందిన పాతనేరస్థులైన అఫ్రోజ్ఖాన్, మహ్మద్ ఇర్ఫాన్ ఖాన్లతో అమ్జద్ను హత్య చేసేందుకు రూ.50 వేలతో బేరం కుదుర్చుకున్నాడు. వీరిద్దరూ మరో ముగ్గురితో కలిసి అమ్జద్ హత్యకు పథకం వేశారు. ప్లా
న్లో భాగంగా ఈ నెల 22న ఫ్లైవుడ్ దుకాణానికి వెళ్లిన ఒక నిందితుడు వినియోగదారుడిలాగా బేరం మాట్లాడుతూ.. బయట నిల్చున్న మరో ఇద్దరికి సైగ చేశాడు. దీంతో వారిద్దరూ అమ్జద్ను కత్తులతో పొడిచి.. పక్కనే ఉన్న సుత్తి, ఇనుపరాడ్తో విచక్షణారహితంగా దాడి చేశారు.
వీరిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానికులను కత్తులు, మారణాయుధాలతో బెదిరిస్తూ.. అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో పడివున్న అమ్జద్ అలీఖాన్ను అతని కుమారులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. నిందితులను అరెస్ట్ చేశారు.. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి అసద్ ఖాన్ కోసం గాలిస్తున్నారు.