తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల నేపథ్యంలో కోదాడ పార్టీ నేతల్లో అసమ్మతి సెగ రాజుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్కు మళ్లీ టికెట్ ఇవ్వడంపై కొందరు నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
కోదాడ బీఆర్ఎస్లో అసమ్మతి తారాస్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్కు మళ్లీ టికెట్ ఇవ్వడంపై కొందరు నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వ్యతిరేక వర్గం శుక్రవారం హైదరాబాద్లో భేటీ అయ్యింది. చందర్ రావు, శశిధర్ రెడ్డితో పాటు కోదాడకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. బొల్లం మల్లయ్య యాదవ్కు ఎన్నికల్లో సహకరించొద్దని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.
మరోవైపు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలను కలిసేందుకు నిన్నటి నుంచి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తనకు మద్ధతుగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే చందర్ రావు ఇంటికి వెళ్లారు. కానీ ఆయన ఎమ్మెల్యేను కలిసేందుకు ఆసక్తి చూపలేదని సమాచారం. అరగంట పాటు చందర్ రావు ఇంట్లోనే ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య కూర్చొన్నారు. అయినా చందర్ రావు బయటకు రాలేదని సమాచారం. కోదాడ టికెట్ను మరోసారి మల్లయ్య యాదవ్కు ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే చందర్ రావు, శశిధర్ రెడ్డి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇకపోతే.. మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్ధి , సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ టికెట్ మార్చాలని నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు సమావేశమయ్యారు. మహబూబాబాద్లోని ఒక బీఈడీ కళాశాలలో ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గీయులు భేటీ అయి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేగా శంకర్ నాయక్ పోటీ చేస్తే ఆయనకు సపోర్ట్ చేసేది లేదని సమావేశంలో తీర్మానించారు . మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్ధిని మార్చాలని డిమాండ్ చేశారు.
ALso Read: మహబూబాబాద్ బీఆర్ఎస్లో అసమ్మతి సెగ : శంకర్ నాయక్కు టికెట్ వద్దు, సహకరించం.. అధిష్టానానికి అల్టీమేటం
తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని తన అనుచరులకు రవీందర్ రావు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ కోసం పనిచేస్తామని ఎమ్మెల్యే శంకర్ నాయక్ కోసం పనిచేయబోమని చెబుతున్నారు రవీందర్ రావు వర్గీయులు. తాము శంకర్ నాయక్తో కలిసి తిరిగినా జనం ఓట్లు వేయరని వారు అంటున్నారు. శంకర్ నాయక్ను నియోజకవర్గ ప్రజలు నమ్మడం లేదని.. ఆయన తప్పకుండా ఓడిపోతారని చెబుతున్నారు. సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అభ్యర్ధిని మార్చేలా చూస్తానని రవీందర్ రావు తన అనుచరులకు హామీ ఇచ్చారు. అయితే ఇదంతా ఆయన ఆడిస్తున్న డ్రామా అని ఆరోపించారు ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్గీయులు.
కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ప్రకటన బిఆర్ఎస్ లో కలకలం రేపింది. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో కొందరు ఇప్పటికే బిఆర్ఎస్ కు రాజీనామా చేసి ఇతర పార్టీలవైపు చూస్తుండగా మరికొందరు నాయకులు అదే బాటలో నడిచేందుకు సిద్దమవుతున్నారు. సన్నిహితులు, అనుచరులతో చర్చించి రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకోడానికి సిద్దమవుతున్నారు. ఇలా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన, కేసీఆర్ తీరుతో తీవ్ర అసంతృప్తితో వున్నట్లు తెలుస్తోంది.
