317 జీవోపై చల్లారని అసంతృప్తి.. తెలంగాణ సర్కార్ కు ముగ్గులతో నిరసన
317 జీవో పై ఉద్యోగుల్లో అసంతృప్తి చల్లారడం లేదు. ప్రతీ రోజు ఏదో ఒక రకంగా నిరసలు తెలుపుతూనే ఉన్నారు. అయితే ఈ సంక్రాంతి పండగ సందర్భాన్ని ఉపయోగించుకొని కూడా తెలంగాణ సర్కార్ తీరును ముగ్గుల ద్వారా ఉద్యోగులు నిరసిస్తున్నారు.
ఉద్యోగుల బదిలీల కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 317 (317 GO) వివాదం రోజు రోజుకు ముదురుతోంది. గత కొన్ని రోజులుగా ఈ జీవోపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు ఈ అంశంపై ఆందోళనలు చేస్తున్నాయి. ఈ జీవోను వెంటనే వెనక్కు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
నిరసన తెలపడం ఒక ప్రాథమిక హక్కు. ఇది రాజ్యాగం అందరికి కల్పించిన ఆయుధం. దీని ద్వారా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టే ప్రభుత్వాల నిర్ణయాలను వెనక్కి తీసుకునేలా చేయవచ్చు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాల రద్దు కూడా ఈ నిరసన హక్కు ద్వారా రైతులు సాధించిన ఘనతే. ఇలా చెబుతూ పోతే చరిత్రలో ఈ నిరసనల ద్వారా ప్రభుత్వాలు ఎన్నో సందర్భాల్లో వెనక్కి తగ్గాయి.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోపై కూడా ఈ విధమైన నిరసనలే వెల్లువెత్తుతున్నాయి. సందర్భానుసారం ఉద్యోగులు, ప్రతిపక్ష నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు నిరసన తెలుపుతూనే ఉన్నారు. అయితే నేడు సంక్రాంత్రి సందర్భంగా ప్రభుత్వానికి 317జీవోపై నిరసన సెగ తగిలేలా వేసిన ముగ్గు ఇప్పుడు వైరల్ గా మారింది. ‘‘అయ్యా ముఖ్యమంత్రి గారూ.. జర మా మొర ఆలకించు సారూ.. ఈ భోగి మంటల్లో జీవో నెంబర్ 317ను తగలేసి, సంక్రాంత్రి పండగ పూట తీపి కబురు చెప్పండి ’’ అంటూ వేసి ఉన్న ముగ్గు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సర్య్కులేట్ అవుతోంది. అందమైన రాతతో, చక్కటి భోగి మంట ప్రతిభింబించేలా వేసిన ఈ ముగ్గు అందరినీ ఆలోచింపజేస్తోంది. కేసీఆర్ సర్కార్ కు ఉద్యోగుల నిరసన సెగ తగిలేలా ఈ ముగ్గును ఎవరు వేశారో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది.
ఏంటి ఈ జీవో.. ?
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 317 జీవో ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి పుట్టిన ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోకుండా క్యాడర్ (cader) సీనియారిటీని పరిగణనలోకి తీసుకుటోంది. దీని వల్ల ఉద్యోగులు తను నివసించే ప్రదేశాల కంటే దూర ప్రాంతాలకు ట్రాన్స్ ఫర్ (transfer) అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ కొత్త జీవో వల్ల భార్యా భర్తలు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటే ఇద్దరు వేరు వేరే జిల్లాలో పని చేసే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈజీవోపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ (nizamabad) జిల్లా భీంగల్ మండలం బాబాపూర్ (babapur)లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సరస్వతి ఈ జీవో వల్లనే ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఉద్యోగుల కేటాయింపుల్లో భాగంగా ఆమెను కామారెడ్డి (kamareddy)జిల్లా గాంధారి (gandhari) మండలం మర్లకుంట తండాకు బదిలీ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె కొన్నేళ్లుగా రహత్నగర్లో సరస్వతి ఉపాధ్యాయురాలిగా పని చేశారు.