Asianet News TeluguAsianet News Telugu

హుజురాబాద్ దళితులకు శుభవార్త... దళిత బంధుకు మరో రూ500కోట్లు విడుదల

దళిత బంధు పథకంలో భాగంగా హుజురాబాద్ దళితులకు రూ.10లక్షల చొప్పున అందివ్వడానికి మరో రూ.500కోట్లను విడుదల చేసింది కేసీఆర్ సర్కార్.  

dalit bandhu scheme in huzurabad... telangana government release another 500 crores
Author
Huzurabad, First Published Aug 23, 2021, 3:02 PM IST

హైదరాబాద్: దళిత సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న దళిత బంధు కోసం మరో రూ.500కోట్లు విడుదలయ్యాయి. ఈ దళిత బంధును పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలుచేస్తుండగా ఇప్పటికే ఓ దఫా రూ.500కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా మరో ఐదువందల కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇలా ఇప్పటివరకు హుజురాబాద్ లో దళిత బంధు అమలుకు ప్రభుత్వం రూ.1000కోట్లు విడుదల చేసింది. 

హుజురాబాద్ లో ఇటీవల దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలు అందించి తీరతామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గానికి రూ.2000కోట్లు విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే  ఇప్పటికే రూ.1000కోట్లను విడుదల చేసిన కేసీఆర్ సర్కార్ మరోరూ.1000కోట్లను వారం రోజుల్లో విడుదల చేయడానికి సిద్దంగా వున్నట్లు తెలుస్తోంది. 

read more  కాంట్రాక్టులు, దుకాణాల్లో దళితులకు రిజర్వేషన్లు: హుజురాబాద్‌లో దళితబంధు‌ సభలో కేసీఆర్

గత సోమవారం హుజూరాబాద్‌ మండలం శాలపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించి దళితబంధు పథకాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్.  పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 21 వేల మంది దళిత కుటుంబాలు ఉన్నట్టుగా సమగ్రసర్వే రిపోర్టులో తేలిందని సీఎం పేర్కొన్నారు. వచ్చే నెల రెండు మాసాల్లో ఈ పథకం కింద ప్రతి ఒక్కరికి డబ్బులు అందుతాయని ఆయన హామీ ఇచ్చారు. ఇందుకోసం రూ.2వేల కోట్లను విడుదల చేయాలని అదే వేదిక నుండి సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 

దళితబంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్  చెప్పారు. రైతు బంధు తరహాలోనే దళితబంధు నిధులు లబ్దిదారులకు అందుతాయన్నారు. దళితబంధు కచ్చితంగా విజయవంతం కానుందన్నారు. దళిత బంధు ప్రభుత్వ కార్యక్రమం కాదు ఒక మహా ఉద్యమమని కేసీఆర్ చెప్పారు.  

అంతకుముందు తన దత్తత గ్రామం వాసాలమర్రి పర్యటనలోనే దళిత బంధును ప్రారంభించారు సీఎం కేసీఆర్. గ్రామంలోని దళిత కుటుంబాలన్నింటికి రూ.10లక్షల చొప్పున అందివ్వనున్నట్లు ప్రకటించి ఆ తర్వాతి రోజే అందుకు సంబంధించిన నిధులు విడుదల చేశారు. మొత్తం 76 కుటుంబాలకు  ఏడు కోట్లు అరవై లక్షలు అందించారు. ఇప్పుడు హుజురాబాద్ దళితులందరికి దళిత బంధు డబ్బులు అందివ్వడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. 
 


 

Follow Us:
Download App:
  • android
  • ios