క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాల జాబితా పెరిగిపోతోంది. దీని గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం, ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించడం లాంటి రకరకాల కారణాలతో మోసపోయేవాళ్లు ఎక్కువవుతున్నారు.

హిమాయత్ నగర్ : Crypto Currencyలో పెట్టుబడి పెడితే రూ. కోట్లు సంపాదించవచ్చునని ఎరవేసిన సైబర్ నేరగాళ్లు ఐదుగురి వ్యక్తుల నుంచి సుమారు రూ. కోటికి పైగా కొట్టేసిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. City Cybercrime ఏసీపీ కేవీఎం ప్రసాద్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కవాడిగూడకు చెందిన శ్రీనివాస్ ను ఇటీవల ఓ వ్యక్తి Telegram Group లో యాడ్ చేశాడు. సదరు గ్రూప్ లో నిత్యం క్రిప్టో కరెన్సీపైనే చర్చ జరుగుతుందేది. 

కొద్ది రోజుల తరువాత శ్రీనివాస్ తో మాటలు కలిపిన సైబర్ నేరగాడు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించాడు. ‘కేకాయిన్’ అనే యాప్ ను శ్రీనివాస్ మొబైల్లో డౌన్ లోడ్ చేయించి పెట్టుబడి పెట్టించాడు. పలు దఫాలుగా రూ.73 లక్షలు పెట్టుబడి పెట్టాడు. రూ.73 లక్షలకు గాను అతడి సైట్ లో ఇతని పేరుపై రూ.4 కోట్లు ఉన్నట్లు చూపిస్తుంది. అయితే ఈ మొత్తాన్ని మార్చుకునేందుకు, డ్రా చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో శ్రీనివాస్ అతడిని నిలదీశాడు. 

మరింత పెట్టుబడి పెడితే ఒకేసారి రూ. కోట్లు తీసుకోవచ్చని చెప్పాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు గురువారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంబర్ పేటకు చెందిన రాజు ఇతని స్నేహితులు మరో ముగ్గురు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు. రాజుకు తెలిసిన వ్యక్తి సహకారంతో రూ.28లక్షలు పెట్టుబడి పెట్టారు. లాభాలు చూపించకపోగా ఇచ్చిన సొమ్మును వెనక్కి ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. 

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 2న కూడా ఇలాంటి మోసమే జనగామ లో జరిగింది. క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం  జరిగింది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేరుతో తమను మోసం చేసినట్లు 300 మందికి పైగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడితే  భారీగా లాభాలు వస్తాయని జనగామ జిల్లా పామనూరు గ్రామానికి చెందిన పల్నాటి నవీన్ చాలా మందిని నమ్మించాడు. ముందుగా లక్షా 70 వేల చొప్పున చెల్లిస్తే వారానికి 13 వేల చొప్పున .. 52 వారాలతో పాటు డబ్బు వస్తుందని నమ్మించాడు నవీన్. 

దీంతో అతని మాటలు నమ్మిన చాలామంది అతనికి డబ్బు చెల్లించారు. అయితే డబ్బు కట్టిన వాళ్లలో కొందరికి మొదట డబ్బులు వచ్చాయని.. తర్వాత రావడం ఆగిపోయాయంటున్నారు బాధితులు. దీంతో నవీన్‌ను ప్రశ్నించగా.. ప్లాన్ ఏ నుంచి ప్లాన్ బీకి మారిందని కట్టుకథలు చెబుతూ కాలం వెల్లబుచ్చుతున్నాడు. డబ్బంతా ఆన్‌లైన్‌లో కట్టేశానని.. ఇప్పుడు తన దగ్గర డబ్బులు లేవని నవీన్ చెబుతున్నాడంటున్నారు బాధితులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.