కూకట్ పల్లిలో నందమూరి సుహాసిని పోటీ చేస్తే తప్పేంటి కేటీఆర్: నారాయణ
కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా నందమూరి సుహాసిని పోటీ చేస్తే తప్పేంటి అని సీపీఐ జాతీయ నేత నారాయణ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. కేపీహెచ్బీ బహిరంగ సభలో నందమూరి సుహాసిని పోటీపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను సీపీఐ జాతీయ నేత నారాయణ ఖండించారు.
హైదరాబాద్: కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా నందమూరి సుహాసిని పోటీ చేస్తే తప్పేంటి అని సీపీఐ జాతీయ నేత నారాయణ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. కేపీహెచ్బీ బహిరంగ సభలో నందమూరి సుహాసిని పోటీపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను సీపీఐ జాతీయ నేత నారాయణ ఖండించారు.
శుక్రవారం కేపీహెచ్బీలో నందమూరి సుహాసినికి మద్దతుగా నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సుహాసిని కూకట్పల్లిలో పోటీ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. దేశంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చన్నారు. అమెరికాలో చదివిన కేటీఆర్కు పోటీచేసే అర్హతల గురించి తెలియదా? అని నిలదీశారు. తెలంగాణ శాసనసభను కేసీఆర్ ఎందుకు అర్థాంతరంగా రద్దు చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
కూటమి పేరు చెబితేనే కేసీఆర్, కేటీఆర్ లకు భయం పట్టుకుందని నారాయణ చెప్పారు. పరిపాలన చేతకాక 9నెలల ముందే అసెంబ్లీని రద్దు చేశారని మండిపడ్డారు. తెలంగాణను అభివృద్ధి చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు.
రానున్న ఎన్నికల్లో గెలిచేది ప్రజా కూటమేనని నారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు. డిసెంబర్ 11 తర్వాత కేసీఆర్ ప్రగతి భవన్ విడిచి ఫామ్ హౌస్లో వంకాయలు పండించుకోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. కూకట్పల్లి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటే సుహాసినిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.