కాంగ్రెస్ లో కోవర్టులు...సమాచారముంది..: ప్రచార కమిటి ఛైర్మన్ మధు యాష్కి సంచలనం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోవర్టులున్నారని... ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తమవద్ద వున్నాయన్నారు ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కి.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో వుంటూ ఇతర పార్టీలకు కోవర్టులుగా వ్యవహరిస్తున్న నాయకులు పూర్తి వివరాలు తమవద్ద వున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటి ఛైర్మన్ మధు యాష్కి పేర్కొన్నారు. ఇలా ఇంతకాలం కోవర్టులుగా వ్యవహరిస్తున్న వారు ఇకపై జాగ్రత్తగా వుండాలని మధు యాష్కి హెచ్చరించారు.
తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీ భవన్ లో పిసిసి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జి బోసు రాజుతో పాటు టిపిసిసి కార్యవర్గం పాల్గొంది. హుజురాబాద్ ఎన్నికలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
ఈ సమావేశం అనంతరం మధుయాష్కి మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి చేతికి పిసిసి పగ్గాలు అందాక అధికార టీఆర్ఎస్ లో భయం మొదలైందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టిందని... పోరాటానికి సిద్దమవుతున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వెళ్లి నిరుద్యోగంపై సమగ్ర నివేదిక రూపొందిస్తామన్నారు.
ఇటీవల ప్రభుత్వం జరిపిన భూముల వేలంలో భారీ అవినీతి వుందని మధు యాష్కి ఆరోపించారు. ఈ కుంభకోణంపై న్యాయపోరాటం చేస్తామన్నారు. అంతేకాకుండా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం అవినీతిని ఎండగడతామని మధు యాష్కి హెచ్చరించారు.