శామీర్పేట కాల్పుల కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు, బుల్లితెర నటుడు మనోజ్ను న్యాయస్థానం మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ కేసులో మనోజ్కు కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శామీర్పేట కాల్పుల కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు, బుల్లితెర నటుడు మనోజ్ను న్యాయస్థానం మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఆయనను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో మనోజ్కు కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.
ఇక శామీర్పేట్ కాల్పుల కేసుకు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను ప్రస్తావించారు. 2003లో స్మితతో సిద్ధార్ధ్ దాస్కు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు (ఒక కుమార్తె, ఒక కుమారుడు). ఈ దంపతులు గతంలో హైదరాబాద్ మూసాపేటలో వుండేవారు. ఈ క్రమంలో 2018లో సిద్ధార్ధ్పై స్మిత గృహహింస కేసు పెట్టింది. ఆపై కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసింది. నాటి నుంచి భార్యాభర్తలిద్దరూ విడివిడిగా వుంటున్నారు.
మరోవైపు మనోజ్ పలు సినిమాలు, సీరియల్స్లో నటించాడు. సరైన అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఫేస్బుక్ ద్వారా పరిచయమైన స్మితతో డిప్రెషన్ కౌన్సెలింగ్ చేయించుకున్నాడు. అలా వీరిద్దరి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. స్మిత కొడుకు ఉన్నత చదువుల విషయమై మనోజ్ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆ కుర్రాడు చైల్డ్ వెల్ఫేర్ కమీషన్కు ఫిర్యాదు చేశాడు.
దీనిపై అందిన సమాచారం ఆధారంగా సిద్ధార్ధ్ హైదరాబాద్ వచ్చాడు. ఈ విషయం ముందే తెలుసుకున్న స్మిత.. మనోజ్కు చెప్పింది. దీంతో అతను తన ఎయిర్గన్ లోడ్ చేసి రెడీగా వున్నాడు. సిద్ధార్ధ్ లోపలికి వస్తుండగా కాల్పులు జరిపాడు. ఊహించని పరిణామంతో భయపడిన సిద్ధార్ధ్ బయటకు పరుగులు తీసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. స్మితతో తన బంధానికి మనోజ్ అడ్డుగా వుండటంతో అతనిని చంపేయాలని మనోజ్ నిర్ణయించుకున్నాడు.
అంతకుముందు స్మిత భర్త సిద్ధార్ధ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు మనోజ్కు స్మితతో ఎలా పరిచయం ఏర్పడిందో తనకు తెలియదన్నారు. మనోజ్ను తాను ఎప్పుడూ చూడలేదని.. 2018 నుంచి స్మిత తనకు దూరంగా వుంటోందని సిద్ధార్ధ్ చెప్పాడు. 2019లో విడాకుల కోసం స్మిత కోర్టుకు వెళ్లిందని తెలిపాడు. తన పిల్లలు సీడబ్ల్యూసీని ఆశ్రయిస్తే.. అధికారులు తనకు ఫోన్ చేసి పిలిచారని అందుకే శామీర్పేట్ వెళ్లినట్లు సిద్ధార్ధ్ వెల్లడించాడు. ఈ క్రమంలోనే మనోజ్ తనపై కాల్పులకు పాల్పడ్డాడని.. తుపాకీ ఎక్కుపెట్టగానే భయం వేసిందని, వెంటనే అక్కడి నుంచి పారిపోయానని పేర్కొన్నాడు. బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశానని సిద్ధార్ధ్ చెప్పాడు. సీడబ్ల్యూసీ అధికారులు తన స్టేట్మెంట్ తీసుకున్నారని సిద్ధార్ధ్ వెల్లడించారు.
