ప్రియుడితో కూతురు పరారీ: ఒకే తాడుకు చెట్టుకు ఉరేసుకుని తల్లిదండ్రులు మృతి
కూతురు ప్రియుడితో పారిపోవడంతో మనస్తాపానికి గురైన ఆమె తల్లిదండ్రులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సంఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కంది మండలంలో జరిగింది.
సంగారెడ్డి: కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో పరువు పోయిందని భావించి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఉదయం ఒకే తాడుతో చెట్టుకు భార్యాభర్తలు ఉరేసుకుని మరణించారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రం శివారులోని కైలాష్ గార్డెన్ ఆవరణలో జరిగింది.
అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ గ్రామానికి చెందిన పల్లకొండ నారాయణ (45), ఆయన రాజేశ్వరి (40) కొన్నాళ్లుగా కందిలో నివాసం ఉంటున్నారు. 1995 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ నారాయణ గతంలో సంగారెడ్డి పోలీుస స్టేషన్ లో పనిచేశారు. ప్రస్తుతం జిన్నారంలో పనిచేస్తున్నారు.
నారాయణకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు నిహారికకు పెళ్లి నిశ్చయమైంది. ఆ వివాహం ఇష్టం లేని యువతి రెండు రోజుల క్రితం మరో యువకుడితో వెళ్లిపోయింది. ఆ విషయం తెలుసుకున్న నారాయణ సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు. పెళ్లి కుదిరిన తర్వాత కూతురు ఎక్కుడికో వెళ్లిపోయిందని, ఆ విషయం బంధువులకు తెలిస్తే పరువు పోతుందని మధనపడ్డాడు.
దాంతో భార్యాభర్తలు ఒకే తాడుతో ఉరి వేసుకుని మరణించారు. సమాచారం తెలుసుకున్న అదనపు ఎస్పీ సృజన, డీఎస్పీ బాలాడీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను జిల్లా కేంద్రం ఆస్పత్రికి తరలించారు.