పార్టీలో ఇంటి దొంగలు వున్నారన్న రేవంత్ రెడ్డి... సీనియర్ల ఆగ్రహం, ఎవరెంటో మాకు తెలుసన్న ఠాగూర్
కాంగ్రెస్ పార్టీలో ఇంటి దొంగలు వున్నారన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై సభలు ఎక్కడ పెట్టాలన్నా చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఏకపక్ష నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి నష్టమని సీనియర్లు హెచ్చరించారు.
టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం వాడి వేడిగా జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యవహారంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. దళిత గిరిజన సభల నిర్వహణ తీరుపై వారు అభ్యంతరం తెలిపారు. సోనియా, రాహుల్ లక్ష్యంగా కాకుండా వ్యక్తి పూజ ఎక్కువైందంటూ సీనియర్లు విమర్శించారు. ఇదే సమయంలో పార్టీలో ఇంటి దొంగలు వున్నారన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై సభలు ఎక్కడ పెట్టాలన్నా చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఏకపక్ష నిర్ణయాలు పార్టీకి నష్టమని సీనియర్లు హెచ్చరించారు. అయితే మధ్యలో జోక్యం చేసుకున్న తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో తెలుసునంటూ వ్యాఖ్యానించారు. ఎవరు ఏ లీక్లు ఇస్తున్నారో తెలుసునని ఠాగూర్ చురకలు వేశారు.
కాగా, నిన్న రావిరాలలో జరుగిన దళిత గిరిజన దండోరా సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హుజురాబాద్లో జరిగిన సీఎం సభలో జనం లేరంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. ఇంకా 19 నెలల పాటు కేసీఆర్ పాలనలో వుండాలా అని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయింది ఎవరో.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంపదను దోచుకున్నదెవరో ప్రజలు ఆలోచించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ALso Read:జైలుకెళ్లి వచ్చాడన్నా.. సైలెంట్గానే వున్నా: కోమటిరెడ్డి వ్యవహారంపై జగ్గారెడ్డితో రేవంత్ సంభాషణ
కెకె మహేందర్ రెడ్డికి ద్రోహం చేసి సిరిసిల్లలో టిక్కెట్ కేటీఆర్కు టికెట్ ఇచ్చారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకుంటే టీడీపీ కేటీఆర్ను అక్కడ గెలిపించిందని ఆయన ధ్వజమెత్తారు. తండ్రికి తెలియకుండానే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారన్న మాట అవాస్తవమన్నారు.