బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసుల వ్యవహారం కాంగ్రెస్లో చిచ్చుపెట్టింది. ఉదయం కవితకు నోటిసులిస్తే.. ఇంత వరకు రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలు బీజేపీపై విమర్శలు గుప్పిస్తుంటే.. కమలనాథులు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. అయితే కవిత నోటీసుల వ్యవహారం కాంగ్రెస్లో చిచ్చుపెట్టింది. ఈ వ్యవహారంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందన తెలుసుకునేందుకు మీడియా ప్రశ్నించగా.. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించాల్సింది తాను కాదని రేవంత్ రెడ్డని అన్నారు. ఉదయం కవితకు నోటిసులిస్తే.. ఇంత వరకు ఆయన ఎందుకు స్పందించలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. కవిత వ్యవహారంపై ఏమైనా వుంటే పీసీసీ అధ్యక్షుడినే అడగాలంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ తనయుడు సుహాస్కు కోమటిరెడ్డి బెదిరించినట్లుగా వున్న ఆడియో టేప్ కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. సొంత పార్టీ నేత, తెలంగాణ ఉద్యమకారుడైన సుధాకర్ను, అతని కుమారుడిని చంపుతానంటూ వెంకట్ రెడ్డి బెదిరించినట్లుగా అందులో వుంది. సుహాస్కు ఫోన్ చేసి అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డారు వెంకట్ రెడ్డి. ప్రజల్లో తిరిగినా, తనపై స్టేట్మెంట్ ఇచ్చినా సుధాకర్ను చంపుతామని, హాస్పటల్ను సైతం ధ్వంసం చేస్తానని ఆయన హెచ్చరించారు. తనపై ప్రకటనలు ఇస్తే ఊరుకోబోనని చంపేస్తానని కోమటిరెడ్డి సదరు ఫోన్ కాల్లో సుహాస్ను హెచ్చరించారు. చెరుకు సుధాకర్ను చంపేందుకు 100 కార్లలో తన అనుచరులు, అభిమానులు తిరుగుతున్నారని.. వారిని తాను ఆపలేనని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ఆడియో తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది.
ALso REad: పోరాడదాం.. ఆందోళన వద్దు, పార్టీ అండగా వుంటుంది : కవితకు కేసీఆర్ భరోసా
అయితే ఇందుకు సంబంధించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలే తప్ప దీని వెనకాల వేరే ఉద్దేశం లేదని తెలిపారు. నకిరేకల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటీ నుంచి తనను తిడుతున్నాడని అన్నారు. చెప్పలేని మాటలు అంటున్నాడని తెలిపారు. మూడు నెలలుగా సోషల్ మీడియా వేదికగా ఒకటే దూషణలు చేస్తున్నారని అన్నారు. దరిద్రుడని, చీడపురుగు అని తిడుతున్నారని.. దాని గురించి అడగడానికే ఫోన్ చేశానని చెప్పారు. 33 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎప్పుడూ ప్రత్యర్థులను దూషించలేదని తెలిపారు. శత్రువులు, ప్రత్యర్థులను కూడా దగ్గరికి తీసే మనస్తత్వం తనదని వెంకట్ రెడ్డి చెప్పారు.
కాగా... ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ నాయకురాలు కవితకు ఈడీ మార్చి 9న విచారణకు హాజరుకావాలంటూ బుధవారం సమన్లు జారీ చేసింది. ఆమె సన్నిహితుడు అరుణ్ రామచంద్రన్ పిళ్లైని ఈడీ నిన్న అరెస్ట్ చేసింది. తాను కవితకు బినామీని అని రామచంద్ర పిళ్లై చెప్పినట్లు ఈడి తెలిపింది. దీంతో ఢిల్లీలో విచారణకు రావాలని ఈడి చెప్పింది. నిన్న అరెస్ట్ చేసిన రామచంద్ర పిళ్లైను ఈడి దాదాపు 80సార్లు ప్రశ్నించింది.
