ఓటమిపై పోస్ట్మార్టమ్: ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు, ఇక ప్రక్షాళన
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావడంపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం సమీక్ష నిర్వహించనుంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావడంపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం సమీక్ష నిర్వహించనుంది. ఈ సమీక్షకు ఢిల్లీకి రావాల్సిందిగా ముఖ్య నేతలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాలకే పరిమితమైంది.
కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావడంపై సమీక్ష నిర్వహించాలని ఆ పార్టీ నాయకులు కొందరు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. గెలిచిన అభ్యర్థులతో పాటు ఓడిపోయిన అభ్యర్థులను పిలిచి సమీక్ష నిర్వహించాలని కొందరు పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావడంపై ఈ నెల 26వ తేదీన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం సమీక్ష నిర్వహించనుంది.ఈ సమీక్షలో పార్టీ ఓటమికి గల కారణాలపై కారణాలను తేల్చనున్నారు.
విపక్షాలతో కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేసినా కూడ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 19 స్థానాలకే పరిమితమైంది.ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ ఓటమిపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నేతలు కొందరు అభిప్రాయంతో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నేతలు ఈ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం కూడ ఆ పార్టీ నాయకత్వానికి మింగుడు పడడం లేదు. ఈ పరిణామాలన్నింటిపై కాంగ్రెస్ నాయకత్వం చర్చించనుంది.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కూడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆ పార్టీ నాయకత్వం అసంతృప్తితో ఉంది. ఈ సమీక్ష తర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలకమైన మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే వరుసుగా రెండు దఫాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గాలం వేస్తున్నారు ఈ తరుణంలో పార్టీని ఈ ఐదేళ్ల పాటు దూకుడుగా నడిపించే నాయకత్వం అవసరమని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు అభిప్రాయంతో ఉన్నారు.
ఈ సమీక్ష తర్వాత పార్టీలో కీలకమైన మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. పీసీసీ నాయకత్వంలో కూడ మార్పులు చేర్పులు చోటు చేసుకొనే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.