త్రిపుర గవర్నర్ గా నల్లు ఇంద్రసేనారెడ్డిని నియమించడంపై  కాంగ్రెస్ పార్టీ సీఈసీ రాజీవ్ కుమార్ కు ఫిర్యాదు చేసింది. ఈ నియామకం ఓటర్లను ప్రభావితం చేయనుందని కాంగ్రెస్ అభిప్రాయపడింది.

హైదరాబాద్: త్రిపుర గవర్నర్ గా నల్లు ఇంద్రసేనారెడ్డి నియామకంపై కాంగ్రెస్ పార్టీ సీఈసీ రాజీవ్ కుమార్ కు ఫిర్యాదు చేసింది. త్రిపుర , ఒడిశా రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి చెందిన కీలక నేత నల్లు ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవి దక్కింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నల్లు ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవిని కట్టబెట్టడంపై కాంగ్రెస్ నేతలు సీఈసీ రాజీవ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. టీపీసీసీ ఎన్నికల కమిటీ చైర్మెన్ నిరంజన్ నేతృత్వంలోని బృందం సీఈసీ రాజీవ్ కుమార్ కు ఈ విషయమై ఫిర్యాదు చేసింది. ఎన్నికలు జరిగే రాష్ట్రం నుండి గవర్నర్ నియామకం సరికాదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది.త్రిపుర గవర్నర్ గా ఇంద్రసేనా రెడ్డి నియామకం ఓటర్లను ప్రభావితం చేసే చర్యగా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది.గవర్నర్ గా ఇంద్రసేనా రెడ్డి నియామకాన్ని నిలిపివేయాలని సీఈసీని కాంగ్రెస్ కోరింది.

విద్యార్ధి దశ నుండి నల్లు ఇంద్రసేనారెడ్డి రాజకీయాల్లో ఉన్నారు. ఏబీవీపీ నుండి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఏబీవీపీ, బీజేవైఎంలలో ఆయన తొలుత పనిచేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రస్తుత తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని గానుగబండ ఇంద్రసేనారెడ్డి స్వగ్రామం.

తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలంగాణకు చెందిన బీజేపీ కీలకనేతకు గవర్నర్ పదవి దక్కడం ఓటర్లను ప్రభావితం చేయడమేనని కాంగ్రెస్ అభిప్రాయపడుతుంది.

also read:త్రిపుర గవర్నర్ గా తెలంగాణ బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి..

తెలంగాణకు చెందిన సీహెచ్ విద్యాసాగర్ రావు గవర్నర్ గా పనిచేశారు. 2014లో ఆయన గవర్నర్ పదవి దక్కింది. మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రస్తుతం హర్యానా గవర్నర్ గా కొనసాగుతున్నారు. తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఈ ఏడాది డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నెల 9వ తేదీన ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ప్రధాన రాజకీయ పార్టీలు రాష్ట్రంలో తమ ప్రచారాన్ని ప్రారంభించాయి.ఆయా పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు.