ఆర్టీసీ సమ్మె: ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎం నేడు కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో ఆర్టీసీ, రవాణాశాఖాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ నెల 5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కేంద్రీకరించింది.
ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఏ మేరకు నిధులను ఖర్చు చేసిందనే విషయమై పూర్తి వివరాలతో రావాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
సమ్మె కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించనున్నారు. కొత్త బస్సుల కొనుగోలు విషయమై చర్చించన్నారు. ఆర్టీసీ సమ్మె గురించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో సహా 26 డిమాండ్లను ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం ముందు ఉంచారు. ఆర్టీసీ ఎలా నష్టాల పాలైంది, నష్టాల నుండి ఆర్టీసీని ఎలా బయటకు తీసుకురావాలనే విషయమై కూడ సీఎం చర్చించనున్నారు.