తన నిరాహార దీక్ష తర్వాతే ఉద్యమం ఓ కొత్త మలుపు తీసుకుందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పేర్లు తలచుకోవాలని, ఆనాటి ఉద్యమనేత ఆమోస్‌ను అప్పటి ప్రభుత్వం వేధించిందని కేసీఆర్ ఆరోపించారు.

నాపై జరిగినంత దాడి ప్రపంచంలో ఏ నేతపైనా జరిగి వుండదని తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అంటే ఉద్యమం నడిపానని ఆయన గుర్తుచేశారు.  నా నిరాహార దీక్ష తర్వాతే తెలంగాణ ప్రకటన వచ్చిందని.. పార్లమెంట్‌లోనే పెప్పర్ స్ప్రే చల్లే స్థాయికి వెళ్లారని కేసీఆర్ తెలిపారు.

తన నిరాహార దీక్ష తర్వాతే ఉద్యమం ఓ కొత్త మలుపు తీసుకుందన్నారు. విద్యార్ధుల ఆత్మహత్యలు తనను కలచివేశాయని.. అమరవీరుల స్థూపం నిర్మాణంలో కొంత జాప్యం జరిగిందని కేసీఆర్ అంగీకరించారు. అత్యుత్తమంగా నిర్మించాలనుకున్నందునే కొంత జాప్యం జరిగిందన్నారు. ఇతర రాష్ట్రాల వారు వస్తే ముందుగా అమరవీరులకు నివాళి అర్పించాలని ఆయన కోరారు. 

ఖమ్మం జిల్లా ఇల్లందులో ఉద్యమ తొలికేక వినిపించిందన్నారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పేర్లు తలచుకోవాలని, ఆనాటి ఉద్యమనేత ఆమోస్‌ను అప్పటి ప్రభుత్వం వేధించిందని కేసీఆర్ ఆరోపించారు. వ్యూహాత్మకంగా తెలంగాణ మలి ఉద్యమం ప్రారంభించామని సీఎం వెల్లడించారు. ఆజన్మ తెలంగాణ వాది ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శకత్వంలో నడిచామని కేసీఆర్ గుర్తుచేశారు. ఉద్యమ స్పూర్తిని జయశంకర్ కాపాడుకుంటూ వచ్చారని సీఎం వెల్లడించారు. 

ఉద్యోగులు, విద్యార్ధులును ఉద్యమంలోకి రానివ్వకూడదని మొదట్లో అనుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. 1969లో 400 మంది చనిపోయిన తర్వాత ఉద్యమం నీరుగారందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరులను నిత్యం స్మరించుకునేందుకే అమరజ్యోతి ఏర్పాటు చేశామన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవి వదిలిన ఉద్యమవాదని.. జలదృశ్యంలోని తన నివాసాన్ని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యమం కోసం ఇచ్చారని కేసీఆర్ గుర్తుచేశారు. అహింసాయుత పద్ధతిలోనే పోరాడాలని నిర్ణయించుకున్నామని.. ఉద్యమపథంలో ఎన్నిసార్లు రాజీనామా చేశామో లెక్కలేదన్నారు. రాజీనామాలను అస్త్రాలుగా వాడి ఉద్యమం నడిపామని తెలిపారు.