సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత పేరు తాజాగా బీఆర్ఎస్ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో లేదు. దీంతో ఆమె శాసనసభకు పోటీ చేస్తారనే ప్రచారానికి తెరపడింది. ఈ నేపథ్యంలోనే ఆమెను నిజామాబాద్ నుంచే లోక్ సభకు పంపించాలని సీఎం కేసీఆర్ ఫిక్స్ అయినట్టు తెలుస్తున్నది.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఈ సారి శాసన సభ బరిలోకి దింపుతారని గత కొంత కాలంగా ప్రచారం జరిగింది. నిజామాబాద్ అర్బన్ నుంచి లేదా జగిత్యాల నుంచి కల్వకుంట్ల కవిత పోటీ చేయడం కన్ఫామ్ అన్నట్టుగా చర్చించారు. కానీ, ఈ రోజు కేసీఆర్ విడుదల చేసిన అభ్యర్థుల జాబితా మాత్రం ఈ ప్రచారానికి తెర దించింది. అసలు కవితను శాసన సభకు ఎన్నిక చేయాలనే ఆలోచనే సీఎం కేసీఆర్కు లేదని స్పష్టమైంది.
గతంలో ఆమె నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. కానీ, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆమె అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ధర్మపురి అర్వింద్ చేతిలో కవిత ఓడిపోయారు. ఇది కవితకే కాదు.. ఆమె తండ్రి సీఎం కేసీఆర్కు కూడా ఒక రకమైన ఇరకాటంలో పడ్డ పరిస్థితి. అధికారంలో ఉన్న పార్టీ ఎంపీగా, అదీ సీఎం కూతురిగా నిలబడి కొత్తగా బరిలోకి దిగిన ఓ వ్యక్తి పై పోటీ చేసి ఓడిపోవడం అప్పుడు ప్రతిష్టకు సంబంధించిన విషయంగా మారింది.
ఇప్పుడు ఆ ఓటమిని మరిచిపోయేలా అదే స్థానం నుంచి అదే అభ్యర్థి పై పోటీ చేసి ఘన విజయం సాధించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకే బిడ్డ కల్వకుంట్ల కవితను అదే స్థానం నుంచి పార్లమెంటుకు పంపించాలని ఆలోచిస్తున్నట్టు అర్థం అవుతున్నది. అందుకే ఆమె పేరు తాజాగా విడుదల చేసిన లిస్టులో లేదని, ఆమెను నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి గెలిపించి పార్లమెంటుకు పంపించాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తున్నది.
