టీచర్ దంపతుల ఆత్మహత్య: ప్రైవేట్ ఉపాధ్యాయులకు 2 వేలు, 25 కేజీల బియ్యం... కేసీఆర్ ప్రకటన
కరోనా కారణంగా ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రైవేట్ టీచర్లను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంది. ప్రైవేట్ టీచర్లకు నెలకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు
కరోనా కారణంగా ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రైవేట్ టీచర్లను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంది. ప్రైవేట్ టీచర్లకు నెలకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
విద్యాసంస్థలు మూసివేయడంతో టీచర్లు ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి సాయం చేస్తామని సీఎం వెల్లడించారు.
ప్రభుత్వ నిర్ణయం వల్ల లక్షా 45 వేల మంది ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి లబ్ధి కలుగుతుందని కేసీఆర్ చెప్పారు. టీచర్లు బ్యాంక్ అకౌంట్తో కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
కాగా, కరోనా కారణంగా ఆర్ధిక ఇబ్బందులతో రెండు రోజుల క్రితం ప్రైవేట్ టీచర్ రవి ఆత్మహత్య చేసుకొన్నాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక ఇవాళ రవి భార్య ఆత్మహత్య చేసుకొంది.
Also Read:కరోనా దెబ్బ: మొన్న టీచర్ ఆత్మహత్య, ఈ రోజు భార్య బలవన్మరణం
కరోనా కారణంగా ఏడాది కాలంగా రవి ఆర్ధిక ఇబ్బందులతో ఇబ్బందిపడుతున్నాడు.దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. భర్తతో గొడవపడి భార్య పిల్లలను తీసుకొని ఇంటి నుండి వెళ్లిపోయింది. దీంతో మనోవేదనకు గురైన రవి రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకొన్నాడు.
ఏడాదిగా ఈ కుటుంబం తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో సతమతమౌతోంది. ఈ తరుణంలో భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య అక్కమ్మ నాగార్జునసాగర్ కుడి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకొంది. భార్యాభర్తలు ఆత్మహత్యలు చేసుకోవడంతో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు.
రవి నాగార్జునసాగర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాడు. కరోనా కారణంగా స్కూల్స్ మూసివేయడంతో ఆయన తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకొన్నారని స్థానికులు చెబుతున్నారు.ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది, బోధన సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రైవేట్ టీచర్లు చెబుతున్నారు.