అగ్ని ప్రమాదంలో దగ్థమైన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ బోగీలను బీబీ నగర్ రైల్వే స్టేషన్‌లో క్లూస్ టీం పరిశీలించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది.

అగ్ని ప్రమాదంలో దగ్థమైన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ బోగీలను బీబీ నగర్ రైల్వే స్టేషన్‌లో క్లూస్ టీం పరిశీలించింది. ఎస్ 4 బాత్‌రూమ్ వద్దే ముందుగా మంటలు చెలరేగినట్లుగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మొత్తం 12 బోగీలను పరిశీలించిన క్లూస్ టీమ్ మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో పడింది. 

మరోవైపు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూటా, ప్రయాణీకుల నిర్లక్ష్యమా, విద్రోహ కోణమా అంటూ పెద్ద చర్చ జరుగుతోంది. పగటిపూట మంటలు వ్యాపించడం, ప్రయాణీకులు, అధికారులు అప్రమత్తంగా వుండటంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. అదే రాత్రి సమయంలో ప్రమాదం జరిగివుంటే దానిని ఊహించడానికే భయంగా వుంది. 

ALso Read: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదం.. లోకో‌పైలట్ ఫిర్యాదుతో కేసు నమోదు

కాగా.. హౌరా - సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించి గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) కేసు నమోదు చేశారు. లోకో‌పైలట్ సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్గొండ జీఆర్‌పీ స్టేషన్‌లో కేసు నమోదైంది. అగ్నిప్రమాదం జరిగిందని కేసు నమోదు చేశారు. విచారణ తర్వాత సెక్షన్లు మారుస్తామని అధికారులు చెబుతున్నారు.

అయితే హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం‌తో దేశం మరోసారి ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. 7 బోగీలు పూర్తిగా మంటల్లో కాలిబూడిదయ్యాయి. ప్రయాణీకులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే మిగిలిన బోగీలతో ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంది. ఫ్లాట్ ఫాం 1పై ప్రయాణీకులు క్షేమంగా దిగారు.