పెళ్లి వేడుకల్లో అపశృతి.. నీటి సంపులో పడి బాలుడు మృతి..
ఫంక్షన్ హాల్ లోని సంపులో పడి ఐదేళ్ల బాలుడు మరణించిన ఘటన శంషాబాద్ బుధవారం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఆ బాలుడు ఒక్క సారిగా చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
పెళ్లి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. సంపులో పడి ఓ బాలుడు మరణించాడు. ఈ ఘటన బుధవారం రాత్రి సమయంలో శంషాబాద్ లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. శంషాబాద్ లోని ఓ ఫంక్షన్ హాలులో బుధవారం ఓ పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి నందిగ్రామ గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి తన భార్య మౌనిక, సోదరుడు, తల్లి తో కలిసి హాజరయ్యాడు. ఐదేళ్ల కొడుకు అభిజిత్ రెడ్డిని కూడా తమ వెంట తీసుకొని వచ్చాడు.
అయితే సాయంత్రం సమయంలో పెళ్లి బరాత్ వేడుకలు నిర్వహించారు. ఇందులో మ్యూజిక్ అభిజిత్ రెడ్డి డ్యాన్స్ చేశాడు. అయితే నాలుగు గంటలు దాటిన తరువాత ఆ బాలుడు అదృశ్యమయ్యాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు కంగారుపడ్డారు. వెంటనే అందరూ కలిసి సమీప ప్రాంతాల్లో గాలించారు. 6 గంటలు దాటినా కూడా బాలుడు కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు ఆర్ జీఐ పోలీసులను ఆశ్రయించి, బాలుడు కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో పోలీసులు ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని మొత్తం నిశితంగా పరిశీలించారు. అయితే ఆ ఫంక్షన్ హాల్ వెనకాల ఉన్న సంపు దగ్గర అభిజిత్ రెడ్డి చెప్పులు కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే సంపులోకి మనుషులను దింపి వెతికించారు. అందులో బాలుడు విగతజీవిగా పడి ఉండి కనిపించాడు. దీంతో మృతదేహాన్ని బయటకు తీశారు.
బాలుడు చనిపోవడానికి ఫంక్షన్ హాల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ కలిసి నేషనల్ హైవేపై ఆందోళన చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.