మీ వాటా ఇవ్వండి... అది పూర్తిచేద్దాం: కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ
వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎంఎంటీఎస్ పనులకోసం కేటాయించిన నిధులు అందించాలంటూ సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ రాశారు.
హైదరాబాద్: ఎంఎంటీఎస్ విస్తరణ పనులు రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వల్లే నిలిచిపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులకోసం కేటాయించిన నిధులు అందించాలంటూ సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ రాశారు.
ఎంఎంటీఎస్ విస్తరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.789 కోట్లు ఖర్చు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన రూ.414 కోట్లు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయని కిషన్రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఆలస్యమవుతున్నకొద్దీ ప్రాజెక్టుపై భారం పడుతుంది కాబట్టి వెంటనే నిధులు విడుదల చేసి పనులను పూర్తి చేయాలని సూచించారు.
అంతేకాకుండా యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ను విస్తరించే దిశగా కార్యాచరణ చేపట్టాలని సీఎంకు కేంద్ర మంత్రి సూచించారు. ఈ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని కిషన్రెడ్డి స్పష్టం చేశారు.