ఉత్తర తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్కడి ప్రజల చిరకాల వాంఛ అయిన కరీంనగర్‌- హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్‌ నిర్మాణానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది.

హైదరాబాద్‌: ఉత్తర తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్కడి ప్రజల చిరకాల వాంఛ అయిన కరీంనగర్‌- హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్‌ నిర్మాణానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. అయితే ఈ ప్రాజెక్టు చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కరీంనగర్-హసన్‌పర్తి మధ్య 62 కిలోమీటర్ల రైలు మార్గానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలతను వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి యుద్ధప్రాతిపదికన రీసర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని రైల్వే ఉన్నతాధికారులను అశ్విని వైష్ణవ్ ఆదేశించారు.రీ సర్వే నివేదిక అనంతరం పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

టీ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. కరీంనగర్‌- హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్‌ అవశ్యకతను ఆయనకు సంజయ్ వివరించారు. రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి వినతిపత్రం కూడా అందజేశారు. రైల్వే లైన్‌ నిర్మాణం ఈ ప్రాంతాల నుంచి గ్రానైట్, వరి, పప్పులు, పసుపు రవాణాను సులభతరం చేయగలదని, అలాగే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన చెప్పారు. అలాగే.. కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు ఉండేలా కొమురవెల్లిలో స్టేషన్ కోసం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను బండి సంజయ్ అభ్యర్థించారు. 

కరీంనగర్‌- హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్‌కు సంబంధించి 2013లో ఒక సర్వే జరిగినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, అనిశ్చితి కారణంగా ప్రాజెక్ట్ టేకాఫ్ కాలేదని బండి సంజయ్ అన్నారు.